WFI | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రెజర్ల లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కోసం కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. బాక్సర్ మేరీ కోమ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల పర్యవేక్షణ కమిటీ పేర్లను ప్రకటించింది. ఒలింపిక్ మెడల్ విజేత యోగేశ్వర్ దత్, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తృప్తి ముర్గుండే, స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధికా శ్రీమన్ టార్గెట్ ఒలింపిక్ పోడియమ్ స్కీమ్ మాజీ సీఈఓ రాజగోపాలన్ సైతం ఈ కమిటీలో మిగిలిన సభ్యులుగా ఉన్నారు. కమిటీ లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఇతర కోచ్లను విచారించనున్నది.
దీంతో పాటు వచ్చే నెలకు సంబంధించి రెజ్లింగ్ సమాఖ్య రోజువారీ కార్యకలాపాలను సైతం కమిటీ పర్యవేక్షించనుంది. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో దిగివచ్చిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, రవి దహియాలతో చర్చలు జరిపి కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రెజర్ల ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఖండించడంతో పాటు రెజర్లపై ఆరోపణలు చేశారు.