బ్రిడ్జ్టౌన్: పేస్ ఆల్రౌండర్ జాసన్ హోల్డర్ నాలుగు బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి మ్యాచ్ను మలుపు తిప్పడంతో.. ఇంగ్లండ్తో చివరి టీ20లో వెస్టిండీస్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ 3-2తో కరీబియన్ల వశమైంది. ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఐదో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ పొలార్డ్ (41 నాటౌట్), పావెల్ (35 నాటౌట్), బ్రాండన్ కింగ్ (34), మయేర్స్ (31) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్, లివింగ్స్టోన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లిష్ జట్టు.. 19.5 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. జేమ్స్ విన్స్ (55), సామ్ బిల్లింగ్స్ (41) రాణించారు. ఆఖరి ఓవర్లో హోల్డర్ (5/27) వరుసగా నాలుగు బంతుల్లో 4 వికెట్లు పడగొట్టడం విశేషం. మ్యాచ్ను మలుపు తిప్పిన హోల్డర్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, అకీల్ హుసేన్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
నాలుగు బంతుల్లో 4 వికెట్లు..
కష్టతరం కాని లక్ష్యఛేదనలో 19 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 160/6తో నిలిచింది. ఆరు బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా.. జోరు మీదున్న బిల్లింగ్స్తో పాటు జోర్డాన్ క్రీజులో ఉన్నారు. దీంతో ఇంగ్లిష్ జట్టుకు మంచి అవకాశాలున్నట్లు కనిపించింది. ఈ దశలో రెండో బంతికి జోర్డాన్ (7)ను ఔట్ చేసిన హోల్డర్.. ఆ తర్వాత వరుసగా బిల్లింగ్స్ (41), రషీద్ (0), సఖీబ్ (0)ను ఔట్ చేయడం ద్వారా ఇంగ్లండ్ను చావుదెబ్బ కొట్టాడు. ఫలితంగా రసవత్తరంగా సాగిన సిరీస్ను విండీస్ కైవసం చేసుకోగలిగింది.