అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇద్దరు వెస్టిండీస్ వెటరన్లు ఒకేరోజు ప్రకటించారు. వారిలో ఒకరు విండీస్ మాజీ సారధి దానేష్ రామ్దిన్ కాగా.. మరొకరు స్టార్ బ్యాటర్ లెండి సిమన్స్. 2019లో చివరిసారిగా వెస్టిండీస్ తరఫున టీ20 క్రికెట్ ఆడిన రామ్దిన్.. తను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నానని, ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రం ఆడతానని ప్రకటించాడు.
‘‘అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు సంతోషంగా ప్రకటిస్తున్నా. గడిచిన 14 ఏళ్లు నా కలలు నిజం చేసింది. ట్రినిడాడ్ అండ్ టొబాగోతోపాటు వెస్టిండీస్కు ఆడాలన్న నా చిన్ననాటి కల నెరవేరింది. నా కెరీర్లో ప్రపంచాన్ని చూసే అవకాశం లభించింది. వేరు వేరు సంప్రదాయాల వాళ్లను కలిసినా.. నేను పుట్టిన గడ్డపై గౌరవం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు’’ అని పేర్కొన్నాడు.
వచ్చే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) కోసం జరిగిన వేలంలో రామ్దిన్ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చెయ్యలేదు. డారెన్ సామీ రిటైర్ అయిన తర్వాత 2014లో విండీస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన అతను.. 2015లో జట్టు పగ్గాలను జేసన్ హోల్డర్కు అప్పగించాడు.
ఇదే సమయంలో మరో స్టార్ ఆటగాడు లెండి సిమన్స్ కూడా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. సీపీఎల్లో అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రింబాగో నైట్ రైడర్స్ తమ ట్విట్టర్ ఖాతాలో ముందుగా ఈ విషయాన్ని వెల్లడించింది. సిమన్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాడని వెల్లడించిన ట్రింబాగో నైట్ రైడర్స్.. సెకండ్ ఇన్నింగ్స్కు శుభాకాంక్షలు తెలిపింది.