కోల్కతా: ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా ఓ ఊహించని బహుమానం లభించింది. అప్పటి వరకూ సింపుల్గా ఇంట్లోనే తన బర్త్డేను సెలబ్రేట్ చేసుకున్న దాదా దగ్గరికి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దీదీ వచ్చారు. గులాబీల బొకే, స్వీట్లతో తన ఇంటికి వచ్చిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీని దాదా సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. అంతేకాదు ఆమె తిరిగి వెళ్లేటప్పుడు గంగూలీ కూడా ఓ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం విశేషం. ఇక మమతా అలా వెళ్లిపోయారో లేదో వెంటనే రాజ్భవన్ నుంచి కూడా బర్త్డే విషెస్ చెబుతూ దాదాకు ఓ బొకే వచ్చింది.
ఈ ఏడాది మొదట్లో కూడా హార్ట్ ఎటాక్తో హాస్పిటల్లో చేరిన గంగూలీని పరామర్శించడానికి మమతా వచ్చారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బెంగాల్లో ఎన్నికలకు ముందు దాదాను ప్రసన్నం చేసుకోవడానికి ఇటు బీజేపీ, అటు టీఎంసీ పోటీ పడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా స్వయంగా దాదాకు ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీయగా, అప్పటి సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, గవర్నర్ జగ్దీప్ ధన్కర్ కూడా హాస్పిటల్కు వెళ్లి గంగూలీని పరామర్శించారు.