పట్టరా..పట్టు! పట్టు పట్టామంటే పతకం పక్కా. గత కొన్నేండ్లుగా కామన్వెల్త్ గేమ్స్ రెజ్లింగ్లో భారత్ అదరగొడుతున్నది. రెజ్లింగ్ పవర్హౌజ్లుగా పేరొందిన ఇరాన్, రష్యా, జపాన్, కజకిస్థాన్ గైర్హాజరీలో మనోళ్లు బరిగీసి కొట్లాడుతూ పతకాలు కొల్లగొడుతున్నారు. కెనడా, నైజీరియా రెజ్లర్లతో ఈసారి నామమాత్రపు పోటీ ఎదురయ్యే నేపథ్యంలో భారత్ పట్టు పట్టాలని చూస్తున్నది. అన్నీ కలిసి వస్తే రెజ్లింగ్లో మనకు పతకాల పంట పండటం ఖాయమనిస్తున్నది. ఒలింపిక్ హీరోలు బజరంగ్ పునియా, రవికుమార్ దహియాకు తోడు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్ చెలరేగితే భారత్కు తిరుగుండకపోవచ్చు. ఈ నేపథ్యంలో రెజ్లింగ్పై ప్రత్యేక కథనం.
కుస్తీ మన దేశానికి వెన్నతో పుట్టిన విద్య. ఈ మట్టితో మల్లయోధులకు ఉన్న అనుబంధం మరువలేనిది. ప్రత్యర్థి ఎంతటోడు అయినా మట్టికరిపించడమే లక్ష్యంగా మల్లయోధులు చేసే విన్యాసాలు అందరినీ కట్టిపడేస్తాయి. ఊపిరి సలుపకుండా ఎత్తుకు పైఎత్తు వేస్తూ పట్టే పట్టుకు రోమాలు నిక్కబొడువడం ఖాయం. నిమిషాల వ్యవధిలో ఫలితం తారుమారయ్యే ఆటలో గెలుపు, ఓటములు నిర్ణయించేది గట్టి పట్టే. బర్మింగ్హామ్ వేదికగా ఈ నెల 28 నుంచి మొదలవుతున్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 12 మందితో బలమైన బృందంతో బరిలోకి దిగుతున్నది. నాలుగేండ్ల క్రితం జరిగిన గోల్డ్కోస్ట్లో 12 పతకాలతో అదరగొట్టిన మనోళ్లు..ఈసారి ఆ రికార్డును తిరుగరాయాలని చూస్తున్నారు.
వినేశ్, సాక్షి పుంజుకోవాలని: తమకు బాగా అచ్చొచ్చిన కామన్వెల్త్ ద్వారా మళ్లీ పుంజుకోవాలని వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్ పట్టుదలతో కనిపిస్తున్నారు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి టోక్యో ఒలింపిక్స్లో తీవ్రంగా నిరాశపరిచిన వినేశ్..ఈసారి పసిడి పతకంతో మెరువాలని చూస్తున్నది. తాను పోటీపడుతున్న 53కిలోల విభాగంలో దీటైన పోటీ లేకపోవడం వినేశ్కు బాగా కలిసిరానుంది. మెగాటోర్నీలకు ముందు గాయాల పాలవుతున్న ఈ హర్యానా రెజ్లర్ గత ప్రదర్శనకు భిన్నంగా ప్రత్యర్థులను ఓడించేందుకు ప్రయత్నించే చాన్స్ ఉంది. మరోవైపు రియో(2016) ఒలింపిక్స్లో కాంస్య ప్రదర్శనతో చరిత్ర లిఖించిన సాక్షి మాలిక్ గత కొన్నేండ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో ఘోరంగా విఫలమవుతున్నది. మానసిక సమస్యలతో సతమతవుతున్న సాక్షి..కామన్వెల్త్ ద్వారా గాడిలో పడేందుకు ఆతృతతో ఉంది. మరోవైపు అన్షు మాలిక్, దివ్య కక్రాన్, పూజ గెహ్లాట్ లాంటి యువ రెజ్లర్లు సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.
బజరంగ్, రవికుమార్ సై: టోక్యో ఒలింపిక్స్లో పతకాలతో మెరిసిన రవికుమార్ దహియా, బజరంగ్ పునియా కామన్వెల్త్లో పోటీకి సై అంటున్నారు. ఒలింపిక్స్తో పోల్చుకుంటే దీటైన ప్రత్యర్థులు లేకపోయినా..స్థాయికి తగ్గ ప్రదర్శనతో పసిడి పతకాలు ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఫిట్నెస్ పరంగా మెరుగ్గా కనిపిస్తున్న బజరంగ్కు ఈసారి ఎదురుండకపోవచ్చు. తనదైన రోజున ఎంతటి ప్రత్యర్థినైనా మట్టికరిపించే బజరంగ్పై భారీ ఆశలు ఉన్నాయి. తన శక్తినంతా కూడదీసుకుంటూ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వని రవికుమార్ కచ్చితంగా స్వర్ణంతో తిరిగి వస్తాడన్న గట్టి నమ్మకముంది. వీరికి తోడు దీపక్ పునియా చెలరేగితే భారత్ పతక జోరుకు బ్రేక్లు వేయడం కష్టం కావచ్చు. వచ్చే నెల 5 నుంచి రెజ్లింగ్ పోటీలు మొదలవుతున్నాయి.
పురుషులు: రవికుమార్ దహియా(57కి), బజరంగ్ పునియా(65కి), నవీన్(74కి), దీపక్ పునియా(86కి), దీపక్(97కి), మోహిత్ గ్రెవాల్(125కి), మహిళలు: పూజ గెహ్లాట్(50కి), వినేశ్ ఫోగట్(53కి), అన్షు మాలిక్(57కి), సాక్షి మాలిక్(62కి), పూజ సిహాగ్(76కి)