Mayank Agarwal | ఈ నెల 26 నుంచి ముంబై వేదికగా ఐపీఎల్-2022 టోర్నీ ప్రారంభం కానున్నది. గత నాలుగు సీజన్లలో పంజాబ్ ఎలెవెన్ జట్టు సభ్యుడిగా మయాంక్ అగర్వాల్ ఉన్నాడు. కానీ, ఇప్పటివరకు పంజాబ్ ఎలెవెన్ జట్టు ఐపీఎల్ టోర్నీ గెలుచుకోలేదు. కానీ ఈ దఫా పంజాబ్ ఎలెవెన్ జట్టు సారధిగా మయాంక్ అగర్వాల్.. టోర్నీ కోసం ఆతురతతో ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. ఇటీవల జరిగిన మెగా వేలంలో శిఖార్ ధావన్, కగిసో రబడా, లియాం లివింగ్ స్టోన్, జాన్ బెయిర్స్టో వంటి కీలక ప్లేయర్లను పంజాబ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగుతున్నట్లు మయాంక్ అగర్వాల్ చెప్పాడు.
తమ జట్టుకు టైటిల్ గెలుచుకునే సత్తా ఉందని నమ్ముతున్నానని మయాంక్ అగర్వాల్ అన్నాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు మ్యాచ్లో అత్యుత్తమ ఆట ప్రదర్శిస్తే విజయాలు సాధించొచ్చునన్నాడు. ఐపీఎల్ మెగావేలంలో అత్యుత్తమ ప్లేయర్లను ఎంచుకోవడంలో నైపుణ్యం ప్రదర్శించామన్నాడు. ముంబై, పుణెల్లోనే టోర్నీ సాగనున్నది. తమ జట్టులో చాలా మంది అనుభవం గల క్రికెటర్లు ఉన్నారని, కనుక సారధిగా జట్టును ముందుకు నడుపగలనని పేర్కొన్నాడు. మ్యాచ్ను బట్టి బ్యాటింగ్ ఆర్డర్ నిర్ణయిస్తామని తెలిపాడు.