WFI : గత ఏడాది కాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలు, రెజ్లర్ల పోరాటాలు, కోర్టుల జోక్యం, నిషేధం వంటి సమస్యలతో సతమతమవుతున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మరోసారి చర్చల్లో నిలిచింది. గత నెలలో ముగిసిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలలో గెలిచిన సంజయ్ సింగ్ ప్యానెల్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆ ప్యానెల్పై సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. అయితే భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) డబ్ల్యూఎఫ్ఐ వ్యవహారాలను చూసుకునేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన అడ్హక్ కమిటీని నియమించగా.. ఆ కమిటీ రెండ్రోజుల క్రితమే ఫిబ్రవరిలో సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తామని తేదీలను కూడా ప్రకటించింది. తాజాగా సంజయ్ సింగ్ అడ్హక్ ప్యానెల్ ప్రకటనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అడ్హక్ కమిటీ ప్రకటన నేపథ్యంలో సంజయ్ సింగ్ పీటీఐతో మాట్లాడుతూ… ‘మేం ఎన్నికలలో ప్రజాస్వామ్యయుతంగా గెలిచాం. మేం గెలిచిన పత్రాలపై రిటర్నింగ్ ఆఫీసర్ సంతకాలు కూడా చేశారు. వాళ్లు దానిని ఎలా మరుగునపెడతారు..? ఈ అడ్హక్ ప్యానెల్ను మేం గుర్తించం.. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మాపై విధించిన సస్పెన్షన్ను కూడా మేం గుర్తించం. డబ్ల్యూఎఫ్ఐ తన పని తాను చేసుకుపోతోంది. మేం మా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాం…
మేం (స్టేట్ అసోసియేషన్స్) టీమ్స్ను పంపకపోతే వాళ్లు (అడ్హక్ కమిటీ) నేషనల్ ఛాంపియన్స్ ఎలా నిర్వహిస్తారు..? మేం త్వరలోనే మా నేషనల్ ఛాంపియన్షిప్ను నిర్వహిస్తాం. మేం త్వరలోనే ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరుపుతాం. రేపో ఎల్లుండో ఈ మీటింగ్కు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి. వాళ్ల కంటే ముందే మేం నేషనల్ ఛాంపియన్షిప్ నిర్వహించి తీరుతాం..’అని సంజయ్ సింగ్ చెప్పాడు.
అంతేగాక కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తమపై విధించిన సస్పెన్షన్పై తాము లేఖ రాశామని, ఇంకా దానికి రిప్లే రావాల్సి ఉందని సంజయ్ సింగ్ అన్నాడు. తాము నిబంధనలను ఉల్లంఘించలేదని తెలిపాడు. ఒకవేళ వాళ్లు (స్పోర్ట్స్ మినిస్ట్రీ) తమతో చర్చలకు రాకుంటే తాము కూడా ఆ సస్పెన్షన్ను అంతగా పట్టించుకోమని కుండబద్దలు కొట్టాడు. సంజయ్ సింగ్ ప్రకటనతో రెజ్లర్లలో ఆందోళనకు దారి తీస్తుంది. ఫిబ్రవరి 2 నుంచి 5 వ తారీఖు దాకా జైపూర్లో సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తామని అడ్హక్ కమిటీ ప్రకటన చేయడం.. తాజాగా సంజయ్ సింగ్ దానికి కౌంటర్గా తామే వాటిని నిర్వహిస్తామని చెప్పడం కొత్త చర్చకు దారి తీసింది. పారిస్ ఒలింపిక్స్కు సన్నద్ధమవుతున్న వేళ రెజ్లర్లకు ఈ సమస్య కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టేలా ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.