హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్లపై ఇంటాబయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నది. దాదాపు మూడేండ్ల తర్వాత భాగ్యనగరంలో జరుగుతున్న మ్యాచ్ కోసం ఎలాంటి లోపాల్లేకుండా ఏర్పాట్లు చేయాల్సిన హెచ్సీఏ గతంలోఎన్నడూ లేని రీతిలో అభాసుపాలవుతున్నది. తమ అభిమాన క్రికెటర్ల ఆటను దగ్గర్నుంచి వీక్షిద్దామనుకున్న అభిమానుల ఆశలను వమ్ము చేసిన హెచ్సీఏ అసలు మా తప్పేం లేదంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఈనెల 25న భారత్, ఆసీస్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్, కార్యదర్శి విజయానంద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టికెట్ల గందరగోళంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేక తీవ్రంగా తడబడ్డారు. ముఖ్యంగా హెచ్సీఏ చీఫ్ అజర్ తప్పేం లేదు, టికెట్ల విక్రయంలో మా ప్రమేయం లేదంటూ వ్యాఖ్యానించాడు. మ్యాచ్ ఏర్పాట్లపై అజర్ మాట్లాడుతూ ‘టికెట్ల విక్రయాన్ని థర్డ్ పార్టీకి అప్పగించాం. మొత్తం వ్యవహారం వాళ్లే చూసుకున్నారు. ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు. అలాంటప్పుడు జరిగిన తప్పిదానికి మమ్మల్ని ఎందుకు బాధ్యులు చేస్తున్నారు. మేము కలుగజేసుకున్నట్లు ఎక్కడ ఆధారాలు లేవు. జింఖానాలో గురువారం జరిగిన ఉదంతం నిజంగా బాధాకారం. దానికి మమ్మల్ని విమర్శించడం సరికాదు. కొన్ని టికెట్లు ఆన్లైన్లో, మరికొన్ని ఆఫ్లైన్లో అమ్మినప్పుడు మేము ఎట్లా కలుగజేసుకుంటాం. బ్లాక్లో ఎవరైనా టికెట్లు అమ్మినట్లు తేలితే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఎవరన్న టికెట్ కొన్న తర్వాత వాళ్లు బ్లాక్లో అమ్ముతున్నారా, ఇంకా ఏం చేస్తారన్నది మాకు ఎలా తెలుస్తుంది. కొన్ని విషయాలు మా పరిధిలో ఉండవు. ఏది ఏమైనా ప్రభుత్వ సహకారంతో మ్యాచ్ను విజయవంతంగా నిర్వహిస్తాం’ అని అన్నాడు.
మా మధ్య విబేధాలున్నాయి: విజయానంద్
హెచ్సీఏ కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ ‘అసోసియేషన్లో కార్యవర్గ సభ్యుల మధ్య విబేధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నా యి. మ్యాచ్ను విజయవంతంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో కలిసి పనిచేస్తున్నాం. టికెట్ల విక్రయాన్ని థర్డ్ పార్టీకి అప్పగించాం. ప్రభుత్వంతో కలిసి మ్యాచ్ను సాఫీగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం’ అని అన్నాడు.
వారిదే బాధ్యత: జింఖానాలో జరిగిన తొక్కిసలాటకు పేటీఎమ్దే బాధ్యత అని విజయానంద్ పేర్కొన్నాడు. టికెట్ల అమ్మకం వారికే ఇచ్చినందునా వారే బాధ్యత వహించాల్సింది ఉంటుందని అన్నాడు.
అమ్ముడైన టికెట్లు ఇవి
భారత్, ఆసీస్ టీ20 మ్యాచ్కు ఎన్ని టికెట్లు అమ్ముడుపోయాయి అన్న మీడి యా ప్రతినిధుల ప్రశ్నకు అజర్ స్పందిస్తూ ‘సెప్టెంబర్ 15న ఆన్లైన్లో జరిగిన సేల్స్లో 11,450 టికెట్లు, కార్పొరేట్ బాక్స్ టికెట్లు-4000, ఆఫ్లైన్లో 3000, ఆన్లైన్లో 2,100 టికెట్లు, అసోసియేషన్లో కార్యవర్గ సభ్యులు, ప్రతినిధులు, ఆయా క్లబ్ల కార్యదర్శులకు 6000 టికెట్లు కేటాయించాం’ అని అన్నాడు. అజర్ లెక్కల ప్రకారం చూస్తే అమ్ముడైన టికెట్లు 26,550. స్టేడియం పూర్తి సామర్థ్యం 39,000లు కాగా, మిగిలిన 12,450 టికెట్ల లెక్క తేలకపోవడం గమనార్హం.
బాధితులకు అండగా ఉంటాం
జింఖాన మైదానం తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారికి అండగా ఉంటామని హెచ్సీఏ చీఫ్ అజర్ పేర్కొన్నాడు. ఇలా జరుగడం బాధాకరమన్న అజర్..బాధితుల వైద్య ఖర్చులు పూర్తిగా తామే భరిస్తామని స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే కొవిడ్-19 కారణంగా ఇన్ని రోజులు మ్యాచ్లు జరుగకపోవడం వలన చాలా ఆదాయం కోల్పోయామన్నాడు. మ్యాచ్కు వచ్చే అభిమానుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించాడు.
ఏర్పాట్లపై సుప్రీం కమిటీ సమీక్ష
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హెచ్సీఏ పరిపాలన వ్యవహారాలను చూసేందుకు సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సూపర్వైజరీ కమిటీ టీ20 మ్యాచ్ ఏర్పాట్లను సమీక్షించింది. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ, అవినీతి నిరోధక విభాగం డీజీ అంజనీకుమార్, మాజీ ప్లేయర్లు వెంకటపతి రాజు, వంకా ప్రతాప్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మ్యాచ్ సజావుగా సాగడంపై అందరూ దృష్టి పెట్టాలని కక్రూ స్పష్టం చేశారు. ప్రభుత్వ వర్గాలు తోడ్పాటు అందించాలని, మ్యాచ్ విజయవంతం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. మ్యాచ్ నిర్వహణ విషయంలో హెచ్సీఏ కార్యవర్గానికి సుప్రీం కమిటీ పూర్తి స్వేచ్చనిచ్చింది.