IND vs ENG 1st Test: ఇండియా – ఇంగ్లండ్ మధ్య నేడు హైదరాబాద్ వేదికగా మొదలైన తొలి టెస్టులో పర్యాటక జట్టు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ విఫలమైంది. బజ్బాల్ ఆటతో స్టోక్స్ సేన భారత జట్టుకు షాకులిస్తుందని అంతా అనుకున్నా అలా మాత్రం ఏమీ జరుగలేదు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 246 పరుగులకే ఆలౌట్ కాగా, భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇప్పటికే 119 పరుగులు చేసి మొదటిరోజు పైచేయి సాధించింది. అయితే తొలి రోజు ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్కు వచ్చాక ఆ జట్టు మాజీ సారథి కెవిన్ పీటర్సన్ అత్యుత్సాహం ప్రదర్శించి అబాసుపాలయ్యాడు. టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. పీటర్సన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
మ్యాచ్ మొదలై ఇంగ్లండ్ పది ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 50 పరుగులు చేయడంతో పీటర్సన్ తన ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తూ.. ‘ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తోంది. ఇవాళ 450/9 స్కోరు చేసి డిక్లేర్ చేస్తుందా..?’ అని అత్యుత్సాహం ప్రదర్శించాడు. కానీ భారత స్పిన్ త్రయం అశ్విన్, అక్షర్, జడేజాలు పర్యాటక టీమ్కు చుక్కలు చూపించడంతో ఆ జట్టు బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఉదయం పది గంటలకు ఇంగ్లండ్ 450 పరుగులు చేస్తుందని ట్వీట్ వేసిన పీటర్సన్.. మధ్యాహ్నం 12:40 గంటలకు మరో ట్వీట్ చేశాడు. ‘బ్లడీ హెల్.. చూడబోతే ఇది రెండు రోజుల్లోనే ముగిసేట్టుందే..’ అని రాసుకొచ్చాడు.
.@DineshKarthik will translate this one for you @KP24 😅 #INDvENG pic.twitter.com/3PSpy2rWlw
— Wasim Jaffer (@WasimJaffer14) January 25, 2024
ఈ ట్వీట్పై జాఫర్ స్పందిస్తూ.. ఓ ఇంట్రెస్టింగ్ మీమ్ను షేర్ చేస్తూనే పీటర్సన్కు కౌంటర్ ఇచ్చాడు. పీటర్సన్ తొలి ట్వీట్ను ‘ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు’ అని, రెండో ట్వీట్ను ‘కొంచెం దూరం వెళ్లాక’ అన్న మీమ్ను షేర్ చేస్తూ.. ‘ఏం బాధపడకు కేపీ.. దినేశ్ కార్తీక్ అక్కడే ఉన్నాడుగా.. నీకు ఈ మీమ్ను ట్రాన్స్లెట్ చేస్తాడులే..’ అని రాసుకొచ్చాడు. జాఫర్ కౌంటర్కు భారత ఫ్యాన్స్ కూడా స్పందిస్తున్నారు. ఇన్నాళ్లూ ఇంగ్లండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ వంటి వాడే జాఫర్ జోరుకు తట్టుకోలేకపోయాడని, పీటర్సన్కు ఇది ఆరంభం మాత్రమే అని కామెంట్స్ చేస్తున్నారు.