చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గత శనివారం చెన్నై నగరంలోని చెపాక్ స్టేడియంలో తన ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడింది. చెన్నై ప్లే ఆఫ్స్కు చేరకపోతే మహేంద్ర సింగ్ ధోనీకి చెపాక్లో అదే ఆఖరి మ్యాచ్. దాంతో ఆ మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీకి అభిమానులు జేజేలు తెలిపారు. దాంతో ధోనీ కూడా గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా స్టేడియంలోని క్రికెట్ అభిమానులు, ఇళ్లలో టీవీల ముందున్న ప్రేక్షకుల ఆనందాన్ని రెట్టింపు చేసే మరో అత్యంత అరుదైన ఘటన చోటుచేసుకుంది.
లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మైదానంలోకి పరుగున వచ్చి తన షర్ట్పై మహేంద్రసింగ్ ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. దాదాపు తన వయస్సులో సగం వయస్సు ఉన్న వ్యక్తి ముందు ఒక అభిమానిలా నిలబడి గవాస్కర్.. ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం క్రికెట్ ప్రేమికుల మనసును దోచేసింది. అయితే, తాను ధోని ఆటోగ్రాఫ్ తీసుకోవడం వెనుక ఉన్న మతలబును గవాస్కర్ తాజాగా వెల్లడించారు.
‘ఈ ఐపీఎల్ సీజన్కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్కు, కెరీర్లో మహేంద్రసింగ్ ధోనీకి చెపాక్ స్టేడియంలో అదే ఆఖరి మ్యాచ్ అని తెలువగానే.. మ్యాచ్ అనంతరం ఒక ప్రత్యేక మధుర జ్ఞాపకాన్ని సృష్టించుకోవాలని నిర్ణయించుకున్నా. అందుకే తాను ధోని దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లి అతని ఆటోగ్రాఫ్ తీసుకున్నా. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయితే చెపాక్లో ధోనీకి మరో మ్యాచ్ ఆడే అవకాశం రావచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఇదే ఆఖరి మ్యాచ్. అందుకే ఈ సందర్భంగా నాకు ఒక ప్రత్యేక జ్ఞాపకాన్ని మిగిల్చుకోవాలని డిసైడ్ అయ్యా. నేను ధోనీ ఆటోగ్రాఫ్కు వెళ్లినప్పుడు అదృష్టవశాత్తు కెమెరా యూనిట్లోని ఒక వ్యక్తి దగ్గర మార్కర్ పెన్ లభించింది. ఆ వ్యక్తికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా’ అని ఓ స్పోర్ట్స్ ఛానెల్తో గవాస్కర్ చెప్పారు.
పరుగెత్తుకుంటూ వెళ్లి భారత్ క్రికెట్కు వెలకట్టలేని సేవలు అందించిన మహేంద్రసింగ్ ధోనీని ప్రశంసించడం, అడిగి ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవడం నా జీవితంలో మరో ఉద్వేగభరితమైన సందర్భమని గవాస్కర్ చెప్పారు. దానికిముందు తన జీవితంలో తాను చవిచూసిన మరో రెండు ఉద్వేగభరిత సందర్భాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అందులో ఒకటి 1983లో కపిల్ దేవ్ ప్రపంచకప్ను ఎత్తిపట్టుకున్న సందర్భం కాగా, మరోటి 2011 ప్రపంచకప్ ఫైనల్లో ధోని సిక్సర్ కొట్టి గెలిపించిన సందర్భమని లిటిల్ మాస్టర్ చెప్పారు. చావడానికి ముందే ఇలాంటి సందర్భాలను చవిచూడటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.