ODI World Cup | వన్డే ప్రపంచకప్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదిపై విమర్శల వర్షం కొనసాగుతోంది. ముఖ్యంగా సొంత దేశ ఆటగాళ్లే అతడిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మెగాటోర్నీ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ తురుపు ముక్క అని అతడిని ఆకాశానికి ఎత్తిన వాళ్లే.. ఇప్పుడు అతడికి అంత సీన్ లేదని అంటున్నారు. షాహీన్ కన్నా భారత ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎంతో బెటర్ అని పాక్ మాజీ సారథి వకార్ యూనిస్ ( Waqar Younis ) పేర్కొన్నాడు.
మెగాటోర్నీలో భాగంగా భారత్తో జరిగిన పోరులో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన షాహీన్పై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. షాహీన్కు అంత సీన్ లేదని.. అతడిని పొగిడి పొగిడి మునగ చెట్టు ఎక్కించారని వ్యాఖ్యానించగా.. ఈ వ్యాఖ్యలను వసీం అక్రమ్ అంగీకరించాడు. అతడు మంచి బౌలరే కానీ.. మరో వసీమ్ అక్రమ్ కాడని రవిశాస్త్రి అన్న వ్యాఖ్యలు వైరల్గా మారగా.. తాజాగా వకార్ యూనిస్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఆరంభ ఓవర్లలో షాహీన్కు వికెట్ దక్కకపోతే.. అతడు అసహనానికి లోనవుతాడని.. షాహీన్కు పిల్లనిచ్చిన మామా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పేర్కొనగా.. తాజా టోర్నీలో అదే జరుగుతున్నది. మరో యువ పేసర్ నసీమ్ షాతో కలిసి తొలి స్పెల్లోనే ప్రత్యర్థులను వణికించే షాహీన్.. నసీమ్ గాయం కారణంగా మెగాటోర్నీకి దూరమవడంతో ఇప్పుడు సాధారణ బౌలర్గా కనిపిస్తున్నాడు. ఇక వకార్ ఆట్లాడుతూ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ రేసులో షాహీన్ కంటే బుమ్రా ఎంతో ముందంటాడని.. తన వరకైతే రోహిత్ ప్రధాన పోటీదారు అని పేర్కొన్నాడు.