Ishan Kishan : మూడో వన్డేలో భారత యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం సాధించడంలో అతని పాత్ర మరవలేనిది. బంగ్లా బౌలర్లపై విరుచుకుపడిన అతను కెరీర్లో తొలి డబుల్ సెంచరీ చేశాడు. అయితే 90ల్లో ఉన్నప్పుడు సిక్స్ కొట్టి సెంచరీ చేయాలనుకున్నాడట. కానీ, విరాట్ కోహ్లీ వారించడంతో సింగిల్స్ తీశానని ఇషాన్ చెప్పుకొచ్చాడు. ‘సిక్స్ కొట్టి సెంచరీ చేయాలనుకున్నా. అయితే.. కోహ్లీ అలా చేయకు.. ఇది నీ మొదటి సెంచరీ. సింగిల్స్ తీయి అని చెప్పాడు’ అని ఇషాన్ తెలిపాడు. సెంచరీ తర్వాత మరింత దూకుడగా ఆడిన ఇషాన్ వన్డేల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్గా వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. అతను 126 బంతుల్లో 200 పరుగులు చేశాడు. భారత్ తరఫున ద్వి శతకం చేసిన నాలుగో బ్యాటర్ ఇషాన్. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ ఈ ఫీట్ను సాధించారు.
ఇషాన్ 131 బంతుల్లో 210 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 10 సిక్స్లు, 24 ఫోర్లు ఉన్నాయి. కోహ్లీ, ఇషాన్ మూడో వికెట్కు 290 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఒకవేళ అవుట్ కాకపోయి ఉంటే ట్రిపుల్ సెంచరీ చేసేవాడినేమో అని చెప్పాడు. ఎందుకంటే.. అప్పటికి 15 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్లో భారత్ 227 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. మొదటి, రెండో వన్డేలో గెలిచిన బంగ్లా 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.