స్టావేంజర్: భారత చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. నార్వే చెస్ టోర్నీలో వరుసగా మూడు విజయాలతో జోరుమీదున్న ఆనంద్ నాలుగో రౌండ్లో పోరాడి ఓడాడు. శనివారం క్లాసికల్ విభాగం నాలుగో రౌండ్లో అమెరికా గ్రాండ్ మాస్టర్ వెస్లీ సో చేతిలో ఆనంద్ పరాజయాన్ని చవిచూశాడు. మొదట 28 ఎత్తులతో మ్యాచ్ ‘డ్రా’ కాగా.. అనంతరం జరిగిన అర్మగెడాన్లో ప్రపంచ మాజీ చాంపియన్ వెనుకబడ్డాడు. 46 ఎత్తులతో వెస్లీ విజయం సాధించాడు.
ఓటమి చెందినా 8.5 పాయింట్లతో మాగ్నస్ కార్ల్సన్తో కలిసి ఆనంద్ సంయుక్తంగా మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి మూడు రౌండ్లలో ఆనంద్.. లాగ్రెవ్ (ఫ్రాన్స్), తపలోవ్ (బల్గేరియా), హో వాంగ్ (చైనా)ను ఓడించిన విషయం తెలిసిందే. అనీశ్ గిరిని చిత్తు చేసి కార్ల్సన్ మూడు పాయింట్లు తన ఖాతాలో వేసుకుని ఆనంద్కు సమంగా నిలిచాడు.