దుబాయ్: టీ20 వరల్డ్కప్( T20 World Cup )లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్కు టైమ్ దగ్గర పడుతోంది. మరో నాలుగు రోజుల్లో ఈ దాయాదులు బిగ్ ఫైట్లో తలపడనున్నారు. ఏ వరల్డ్కప్లో అయినా ఈ ఇద్దరి మధ్య మ్యాచ్ అంటే ఫ్యాన్స్ చెప్పేది ఒక్కటే. ఇప్పటి వరకూ వరల్డ్కప్లో ఇండియాపై పాక్ గెలవలేదు. ఈసారి కూడా అదే జరుగుతుందీ అని. నిజమే.. ప్రపంచకప్లలో పాక్పై ఇండియాకు 13-0తో తిరుగులేని రికార్డు ఉంది. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే అంటున్నాడు. కానీ అదే సమయంలో అతడు పాక్కు ఇదే సరైన సమయమనీ చెప్పడం విశేషం.
ఎన్నో ఏళ్లుగా మనం ఒకే విషయాన్ని వింటూ వస్తున్నాం. ఇది చాలా పెద్ద మ్యాచ్ కావడం ఒకటైతే.. వరల్డ్కప్లలో ఇండియాను పాక్ ఓడించలేదు అన్నది మరొకటి. ఈసారీ అదే జరుగుతుందనీ అనడం సహజమే. కానీ ఇప్పుడున్న పరిస్థితులు, టీ20 ఫార్మాట్ను తీసుకుంటే.. పాక్కు ఎక్కువ అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే 50 ఓవర్ల ఫార్మాట్లో వాళ్లు బాగా ఆడకపోవచ్చు కానీ ఈ ఫార్మాట్లో ఒక్క ప్లేయర్ అయినా ప్రత్యర్థిని ఓడించగలడు. అయితే ఇప్పటి వరకూ అది పాక్ చేయలేకపోయింది. ఈసారి ఏం జరుగుతుందో 24వ తేదీన చూడాలి అని సెహ్వాగ్ అన్నాడు.
ఇండియా ఎప్పుడూ ఈ మ్యాచ్లలో ఉండే ఒత్తిడిని అధిగమించిందని, పాకిస్థాన్లాగా అనవసర కామెంట్స్ చేయలేదని, అందుకే వరల్డ్కప్లలోని అన్ని మ్యాచ్లలో ఇండియా గెలిచిందని వీరూ అభిప్రాయపడ్డాడు. 2011 వరల్డ్కప్ అయినా, 2003 వరల్డ్కప్ అయినా మా మీద పెద్దగా ఒత్తిడి లేదు. ఎందుకంటే వరల్డ్కప్లో పాక్ కంటే ఎప్పుడూ మేము మెరుగ్గానే ఉన్నాం. అలాంటి వైఖరితో ఆడితే మనం ఎప్పుడూ అలాంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వం అని వీరూ అన్నాడు. మాటలు పెద్దగా మాట్లాడకుండా ఇండియా ఎప్పుడూ పూర్తి సంసిద్ధతతో బరిలోకి దిగుతుందని, అందుకే గెలుస్తుందని సెహ్వాగ్ చెప్పాడు.