పాకిస్తాన్తో భారత్ ఆడే మ్యాచ్లో మాజీ సారధి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సత్తా చాటతాడని అఫ్ఘానిస్తాన్ మాజీ కెప్టెన్ అస్ఘర్ అఫ్ఘాన్ అన్నాడు. కీలకమైన మ్యాచులన్నింటిలో కోహ్లీ రాణిస్తాడని చెప్పిన అఫ్ఘాన్.. కోహ్లీ పరుగుల కోసం ఆకలి మీద ఉన్నాడని, తన సత్తాలో రెండొందల శాతం పెట్టి ఆడతాడని అంచనా వేశాడు. చివరగా భారత్, పాక్ ఆడిన మ్యాచ్లో కూడా టీమిండియా తరఫున కోహ్లీనే టాప్ స్కోరర్గా నిలిచాడు.
టీ20 వరల్డ్ కప్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్, రాహుల్ వెంటవెంటనే అవుటైనా.. కోహ్లీ (57) మాత్రం పోరాడాడు. హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఇప్పుడు ఆసియా కప్ మ్యాచ్ కూడా అదే దుబాయ్ మైదానంలో జరగనుంది. ఇంగ్లండ్ పర్యటనలో పేలవంగా ఆడిన కోహ్లీ.. ఆ తర్వాత వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనల్లో ఆడలేదు.
దాదాపు నెలరోజులపైగా విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలోనే 42 రోజుల తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. అలాగే అతను చాలా ఫ్రెష్గా ఉన్నాడని, మంచి టచ్లో కనిపించాడని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చెప్పాడు. దీంతో కోహ్లీ మళ్లీ తన క్లాస్ చూపిస్తాడని అభిమానులు ఆశపడుతున్నారు.