టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ చాలాకాలంగా పేలవ ఫామ్తో విమర్శలు ఎదుర్కుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సెంచరీ చేయక మూడేండ్లు కావస్తోంది. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాదికాలంగా కోహ్లీ ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. ఒకానొక దశలో కోహ్లీని పక్కనబెట్టాలని, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్నాక అతడిని మళ్లీ జట్టులోకి తీసుకుంటే బెటరనే వాదనలు వినిపించాయి. కానీ బీసీసీఐ మాత్రం అతడిపై నమ్మకముంచుతున్నది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం.. కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. ఆసియా కప్లో అతడు తన పూర్వపు ఫామ్ను అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఓ జాతీయ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. ‘ముందు కోహ్లీని ప్రాక్టీస్ చేయనివ్వండి. మ్యాచ్లు ఆడనివ్వండి. కోహ్లీ చాలా గొప్ప ఆటగాడు. అంతర్జాతీయ క్రికెట్లో వేలాది పరుగులు చేశాడు. అతడు త్వరలోనే మునపటి ఫామ్ను అందుకుంటాడు. ఆసియా కప్లో పూర్వపు కోహ్లీని చూస్తామన్న నమ్మకం నాకుంది..’ అని అన్నాడు.
ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇక భారత జట్టు.. తమ తొలి మ్యాచ్ను 28న పాకిస్తాన్తో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. గతేడాది టీ20 ప్రపంచకప్లో భారత జట్టును ఓడించిన పాక్పై ప్రతీకారం తీర్చుకునేందుకు గాను ఈ మ్యాచ్ను వాడుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. కానీ దాదా మాత్రం మిగిలిన మ్యాచ్ల మాదిరిగానే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్నూ చూస్తానని కామెంట్ చేయడం గమనార్హం.
ఇక ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో గంగూలీ పేరు వినపడుతున్న నేపథ్యంలో దాదా ఈ విషయంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీడియాలో వస్తున్నవన్నీ పుకార్లేనని, ఐసీసీ అధ్యక్ష పదవి అనేది ఆషామాషీ వ్యవహారం కాదని అన్నాడు. అయితే ఈ విషయంలో తాను చేయాల్సిందేమీ లేదని.. బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాయని గంగూలీ తెలిపాడు.