Shoaib Akhtar on Kohli టీం ఇండియా సారధిగా విరాట్ కోహ్లీ వైదొలగడంపై రావల్పిండి ఎక్స్ప్రెస్గా పేరొందిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ బలవంతంగా టీం ఇండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని ఆరోపించాడు. తదుపరి టీం ఇండియా టెస్ట్ సారధి ఎంపికపై బీసీసీఐ స్మార్ట్ నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించాడు.
ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్లో పాల్గొంటున్న షోయబ్ అక్తర్ ఓ వార్తాసంస్థతో మాట్లాడాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీని వదులుకోవాలని కోరుకోలేదు. కానీ బలవంతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇది ఆయనకు సరైంది కాదు. కానీ ఆయన సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కోహ్లీ మంచి క్రికెటర్. గొప్ప వ్యక్తి. గొప్ప బ్యాట్స్మన్. ప్రపంచంలో ఎవరూ సాధించలేని రికార్డులను విరాట్ కోహ్లీ నెలకొల్పాడు. ఆయన తన సహజ సిద్ధమైన ఆట ఆడాల్సిన అవసరం ఉంది అని అక్తర్ అన్నాడు.
కోహ్లీ ఫామ్లో ఉన్నప్పుడు చాలా బాగా ఆడాడు. ఫామ్లో లేనప్పుడే సమస్యలు వస్తాయి. దీని నుంచి కోహ్లీ బయటకు రావాలి. ఏ ఒక్కరి పట్ల శత్రుత్వంతో ఉండనవసరం లేదు. ప్రతి ఒక్కరినీ క్షమిస్తూ ముందుకు సాగాలని సూచించాడు. గతేడాది టీ-20 జట్టు సారధిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించగానే.. వన్డే టీం జట్టు సారధిగానూ కోహ్లీని సెలక్టర్లు తొలగించారు. వన్డే, టీ-20 ఫార్మాట్లకు ఒక సారధి మాత్రమే ఉండాలని భావిస్తున్నట్లు సెలెక్టర్లు తెలిపారు. ఏడేండ్లుగా టెస్ట్ జట్టుకు సారధ్యం వహించిన కోహ్లీ గత వారం కెప్టెన్గా వైదొలిగినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.