దుబాయ్: భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమ్ ఇండియాకు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్గా వ్యవహరిస్తున్న విరాట్.. త్వరలో టీ20 సారథ్య బాధ్యతల నుంచి వైదొలగనున్నాడు. స్వయంగా కోహ్లీనే ఈ విషయాన్ని గురువారం ట్విట్టర్లో వెల్లడించాడు. అక్టోబర్ నుంచి యూఏఈ వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ అనంతరం నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్టు అతడు ప్రకటించాడు. విరాట్ ట్వీట్ సారాంశం ‘గత 8-9 ఏండ్లుగా టెస్టు, వన్డే, టీ20లలో ఆడుతున్నా. ఐదారేండ్లుగా మూడు ఫార్మాట్లకూ కెప్టెన్గా ఉన్నా. పని ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నా.
నాయకుడిగా జట్టుకు చేయగలిగినంతగా చేశాను. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత కూడా టీ20 బ్యాట్స్మన్గా జట్టుకు సేవలందిస్తా. కోచ్ రవిభాయ్, సహచరుడు రోహిత్తో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇదే విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షాకు తెలియజేశాను. ఇన్నాళ్లు నాకు సహకరించిన జట్టు సభ్యులకు, సహాయక బృందం, సెలక్షన్ కమిటీకి కృతజ్ఞతలు’ అని కోహ్లీ రాసుకొచ్చాడు. ఇదిలా ఉంటే విరాట్ తర్వాత టీ20 సారథ్య బాధ్యతలు రోహిత్ శర్మ చేపట్టే అవకాశాలున్నాయి. 45 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లలో భారత్కు నాయకుడిగా వ్యవహరించిన విరాట్.. మొత్తంగా 90 మ్యాచ్లలో 52.65 సగటుతో 3,159 పరుగులు చేశాడు. ఇందులో 28 హాఫ్ సెంచరీలున్నాయి.
టీ20 కెప్టెన్గా విరాట్
మ్యాచ్లు 45
విజయాలు 27
ఓటములు 14
టై 2
ఫలితం తేలనివి 2