ముంబై వేదికగా భారత్, న్యూజిల్యాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో మరోసారి అంపైరింగ్ వివాదాస్పదమైంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. శుభ్మన్ గిల్ (44), మయాంక్ అగర్వాల్ (107 నాటౌట్) జట్టుకు శుభారంభం అందించారు. అయితే 80 పరుగుల వద్ద గిల్ అవుటయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా (0), కోహ్లీ (0) ఒకే ఓవర్లో డకౌట్గా వెనుతిరిగారు. వీరిద్దరినీ అజాజ్ పటేల్ అవుట్ చేశాడు. అయితే కోహ్లీని అవుట్గా నిర్ణయించిన విధానం చర్చనీయాంశంగా మారింది. ఇన్నింగ్స్ 30వ ఓవర్లో పటేల్ వేసిన బంతి కోహ్లీ ప్యాడ్లను తాకింది. కివీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ అనిల్ చౌదరి అవుట్ ఇచ్చాడు.
దీంతో షాకైన కోహ్లీ వెంటనే రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి అతని బ్యాట్ను తాకినట్లు కనిపిస్తోంది. అయితే ముందుగా ప్యాడ్ను తాకిందా? లేక బ్యాట్ను తాకిందా? అనే విషయంలో స్పష్టత రాలేదు. దీంతో ఆన్ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే థర్డ్ అంపైర్ కూడా ఓటేశాడు. కోహ్లీని అవుట్గా ప్రకటించాడు.
ఈ నిర్ణయం పట్ల టీమిండియా కోచ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మైదానం వీడే సమయంలో అంపైర్తో కాసేపు మాట్లాడిన కోహ్లీ.. బౌండరీ లైన్ను బ్యాట్తో కోపంగా బాది డగౌట్ చేరాడు. ఈ అంపైరింగ్పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
‘ఈ అంపైరింగ్లో పక్షపాతంలో లేదు.. ఇది పూర్తిగా చెత్త’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి అంపైర్లను అసలు ఎందుకు ఆటలో ఉంచుతున్నారని ప్రశ్నిస్తున్నారు.