మొహాలీ : భారత్ తరఫున 100వ టెస్టులు ఆడిన ఆటగాడిగా మైలురాయిని సాధించేందుకు సిద్ధమైన మాజీ కెప్టెన్ విరాట్.. తాను ఈ ఘనత సాధిస్తానని ఎన్నడూ అనుకోలేదని.. ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన సందర్భమని చెప్పుకొచ్చాడు. జూనియర్ ప్రపంచకప్ నెగ్గి తర్వాత.. 2011లో వెస్టిండిస్తో జరిగిన టెస్టుతో భారత జట్టులోకి అడుగుపెట్టిన విరాట్ అనతికాలంలో కీలక ఆటగాడిగా ఎదిగి.. పదుల సంఖ్యలో చారిత్రాత్మక ఇన్సింగ్స్ ఆడాడు. తొలిటెస్ట్లో 4, 15 మాత్రమే స్కోర్ చేసిన కోహ్లీ పదేళ్లకుపైగా సుదీర్ఘ కెరీర్లో టెస్టుల్లో 50.39 సగటుతో 7962 పరుగులు సాధించాడు. మొహాలీ వేదికగా శుక్రవారం నుంచి భారత జట్టు శ్రీలంకతో తొలిటెస్టులో తలపడనున్నది.
ఈ సందర్భంగా బీసీసీఐ వీడియోను విడుదల చేసింది. ఈ సందర్భంగా వీడియోలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘భారత్ జట్టు తరఫున వంద టెస్టులు ఆడుతానని అనుకోలేదు. సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో క్రికెట్ ఆడాను. ఇందుకు నేను చాలా గర్వపడుతున్నాను. దేవుడితో ఫిట్నెస్ కోసం ఎంతో శ్రమించాను. 100వ టెస్టు నాకు.. నా కుటుంబానికి, నా కోచ్కు ఎంతో పెద్ద విషయం.. ఇంకా చెప్పాలంటే ఇది మాకు ప్రత్యేక సందర్భం. నాకు చిన్నప్పట్నుంచే మ్యాచుల్లో తక్కువ స్కోర్లు చేయడమంటే నచ్చదు.
నేనెప్పుడు గ్రౌండ్ లోకి దిగిన భారీ స్కోర్ చేయాలనే మైండ్ సెట్తో ఉండేవాడిని. జూనియర్ క్రికెట్లో నేను బహుశా ఏడెనిమిది డబుల్ హండ్రెడ్స్ చేసుంటా. క్రీజులో ఎక్కువ సేపు నిలవాలన్నదే నా లక్ష్యం.. నా దృష్టిలో టెస్టు క్రికెటే అసలైన క్రికెట్. అది సజీవంగా ఉండాలి’ అన్నాడు. భారత తరఫున వంద టెస్టు ఆడుతున్న ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఇంతకు ముందు సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్సర్కార్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మ సరసన కోహ్లీ చేరాడు.
‘I never thought i’ll play 100 Test matches. It has been a long journey. Grateful that i’ve been able to make it to 100’ – @imVkohli on his landmark Test.
Full interview coming up on https://t.co/Z3MPyesSeZ. Stay tuned! #VK100 pic.twitter.com/SFehIolPwb
— BCCI (@BCCI) March 3, 2022