సౌతాఫ్రికా పర్యటనకు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతటి అగ్గి రాజేశాడో తెలిసిందే. తనపై వస్తున్న తప్పుడు వార్తలను కొట్టిపారేసిన కోహ్లీ.. టీ20 కెప్టెన్సీ వదిలేసే విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ వ్యాఖ్యలను కూడా తప్పుబట్టాడు. దీంతో కోహ్లీ, గంగూలీ ఎవరు నిజం చెప్తున్నారనే ప్రశ్న క్రికెట్ ప్రపంచాన్ని చుట్టుముట్టింది.
అయితే ఆ తర్వాత మళ్లీ మీడియా ముందుకు కోహ్లీ రాలేదు. దీంతో అతను కావాలనే మీడియాను ఎవాయిడ్ చేస్తున్నాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోమవారం నాడు సౌతాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడారు.
కోహ్లీ ఎందుకు మీడియా ముందుకు రావడం లేదనే ప్రశ్న ఆయన దృష్టికి వచ్చింది. దీనికి బదులిచ్చిన ద్రవిడ్.. కోహ్లీ ఏమీ మీడియాను ఎవాయిడ్ చేయడం లేదని స్పష్టం చేశాడు. మీడియాతో ఎవరు మాట్లాడాలనే విషయాన్ని జట్టు మేనేజ్మెంట్, మీడియా మేనేజర్ నిర్ణయిస్తారని వివరించాడు.
సౌతాఫ్రికాతో జరిగే మూడో టెస్టు.. కోహ్లీ కెరీర్లో 100వ టెస్టు అని, ఆ మ్యాచ్ ముందు మీడియాతో కోహ్లీ మాట్లాడతాడని చెప్పాడు.