Wasim Akram | మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత విరాట్ కోహ్లీ మనిషిలా కనిపించడని.. గ్రహాంతర వాసిలా దర్శనమిస్తాడని.. పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీమ్ అక్రమ్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్తో అతడి ఆటతీరు చూసిన వారెవరికైనా ఈ విషయం అవగతమవతుందని అక్రమ్ పేర్కొన్నాడు. పుణె వేదికగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో విరాట్ అజేయ శతకంతో టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వన్డేల్లో విరాట్ 48వ సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ నేపథ్యంలో వసీమ్ అక్రమ్ మాట్లాడుతూ.. ‘విరాట్ మనిషి కాదు. అతడు మరో గ్రహం నుంచి వచ్చాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్నే తీసుకుంటే.. అతడు 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేశాడు. అది కూడా అత్యంత ఒత్తిడి ఉండే ప్రాంతాల్లో నిల్చున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగి 90 పరుగులు చేసిన సమయంలో అసాధారణ రీతిలో వికెట్ల మధ్య పరిగెడుతూ రెండేసి రన్స్ తీయడం సాధ్యమా. అతను వేరే లెవల్ ఆటతీరు కనబరుస్తున్నాడు’ అని వ్యాఖ్యానించాడు.
ఇక బంగ్లాదేశ్తో మ్యాచ్లో వ్యక్తిగత మైలురాళ్లను అధిగమించేందుకు విరాట్ ప్రయత్నించాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగ్గా.. విరాట్కు పలువురు మద్దతు తెలుపుతున్నారు. మాజీ ఓపెనర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్, ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్, మహమ్మద్ కైఫ్ కోహ్లీ ఆటతీరుకు ఆకాశానికి ఎత్తారు. సరిపడా బంతులు ఉన్న సమయంలో అందులో తప్పేముందని కోహ్లీకి మద్దతుగా నిలిచారు. మరో ఎండ్లో ఉన్న కేఎల్ రాహుల్ ఈ అంశంపై ముందే స్పష్టతనివ్వగా.. తాజాగా శ్రీకాంత్ కూడా కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. ‘విరాట్ చేసిన దాంట్లో తప్పేముంది. ప్రపంచకప్లో సెంచరీ అంటే మామూలు మాటలా. అతడి దీనికి అర్హుడు. ఇంకా చెప్పాలంటే అంతకు మించిన వీరుడు మరొకరు లేరు. చెన్నైలో ఆస్ట్రేలియాపై కేఎల్ రాహుల్కు కూడా ఆ అవకాశం దక్కి ఉంటే బాగుండేది’ అని చిక్కా అభిప్రాయపడ్డాడు.