టీమిండియా మాజీ సారధి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. అన్ని రకాల కెప్టెన్సీలకు దూరమయ్యాడు. టీమిండియా టీ20 జట్టు సారధ్యాన్ని కోహ్లీ వదులుకోగా.. వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ అతన్ని తొలగించింది. ఆ తర్వాత కొన్నిరోజులకే టెస్టు కెప్టెన్సీకి కూడా కోహ్లీ గుడ్బై చెప్పేశాడు.
వీటన్నింటికన్నా ముందే ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. దీంతో ఈ ఏడాది జరిగిన మెగా వేలంలో మాజీ సౌతాఫ్రికా ప్లేయర్, చెన్నైకు అద్భుతమైన ఆరంభాలు అందించిన ఫాఫ్ డు ప్లెసిస్ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. అతనికే జట్టు సారధ్య బాధ్యతలు కూడా అప్పగించింది.
దీనిపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్ మాట్లాడుతూ.. కెప్టెన్సీని డుప్లెసిస్కు ఇవ్వడం సరైనదేనని అన్నాడు. అయితే డుప్లెసిస్ ఐపీఎల్ కెరీర్ చరమాంకంలో ఉందని, మహా అయితే మరొక రెండు సీజన్లు ఆడే అవకాశం ఉందని చెప్పాడు. అదే సమయంలో అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ చేసి కోహ్లీ బాగా అలసిపోయాడని, కాబట్టి అతనికి ప్రస్తుతం విశ్రాంతి లభిస్తుందని అన్నాడు.
ఈ ఏడాది బ్రేక్ ఇచ్చిన అనంతరం వచ్చే ఏడాది మరోసారి ఆర్సీబీ జట్టు పగ్గాలు కోహ్లీకే అందిస్తారని అంచనా వేశాడు. అదే జరిగితే ఆర్సీబీ అభిమానులు చాలా సంతోషిస్తారు. మరి కోహ్లీ ఏం ప్లాన్ చేశాడో చూడాలి.