World Cup 2023 | వన్డే ప్రపంచకప్లో భాగంగా వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టులో ఆసక్తికర సమరం జరుగుతోంది. అదేంటి జట్టంతా కలిసి ప్రత్యర్థులపై సమిష్టిగా విరుచుకుపడుతుంటే.. టీమ్లో పోటీ ఏంటీ అనుకుంటున్నారా! అక్కడికే వస్తున్నా.. అధునిక క్రికెట్లో గ్రేట్ బ్యాటర్లుగా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య నెట్స్లో వార్ నడుస్తున్నది. ఆదివారం ఇంగ్లండ్తో మ్యాచ్ కోసం టీమ్ఇండియా ప్రాక్టీస్ ప్రారంభించగా.. నెట్స్లో రోహిత్, కోహ్లీ అమీతుమీ తేల్చుకుంటున్నారు.
నెట్స్లో మన ప్లేయర్లు అమీతుమీ తేల్చుకోవడం ఏంటీ అనే డౌట్ అవసరం లేదు. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్లో భాగంగా నెట్స్లో రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా.. కోహ్లీ తన బౌలింగ్కు పదును పెడుతూ కనిపించాడు. కోహ్లీ బౌలింగ్లో ప్రాక్టీస్ కొనసాగించిన హిట్మ్యాన్.. ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్కు బౌలింగ్లోనూ అదే మర్యాద ఇచ్చినట్లు కనిపిస్తున్నది. నెట్స్లో పెద్దగా భారీ షాట్లకు ప్రయత్నించని రోహిత్.. విరాట్ వేసిన బంతులను సరైన టైమింగ్తో మిడిల్ చేశాడు. ఈ ఇద్దరు దిగ్గజాలు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో వైరల్గా మారగా.. ‘దమ్ముంటే ఆపుకోండి’ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
రోహిత్ శర్మ పేరులోని మొదటి అక్షరమైన ‘రో’.. కోహ్లీలోని తొలి అక్షరమైన ‘కో’ను కలిపి ‘‘రోకో’’ అంటూ సోషల్ మీడియా హోరెత్తిస్తున్న నేపథ్యంలో.. దమ్ముంటే భారత్ జోరును ఆపండి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ గెలిచిన టీమ్ఇండియా.. ఇంగ్లండ్తో అమీతుమీకి సిద్ధమైంది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా రాబోయే కొన్ని మ్యాచ్లకు అందుబాటులో లేకపోవడంతో.. ప్రత్యామ్నాయ బౌలింగ్ వనరులపై టీమ్ మేనేజ్మెంట్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే మ్యాచ్లో అవసరమైతే ఓ రెండు ఓవర్లు వేసే విధంగా విరాట్ నెట్స్లో తన బౌలింగ్ అస్త్రాలకు పదును పెడుతున్నాడు.