న్యూఢిల్లీ: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రయ్యాడు. కోహ్లీ, అనుష్క దంపతులకు ఈ నెల 15న పండంటి మగబిడ్డ పుట్టాడు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా విరుష్క జోడీ మంగళవారం ప్రకటించింది. ఈ జంటకు 2021లో ఓ పాప (వామిక) జన్మించగా.. ఇప్పుడు బాబుకు ‘అకాయ్’ అని నామకరణం చేసినట్లు వెల్లడించింది. ఇలాంటి సమయాల్లో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన విరుష్క జోడీ.. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగుతుండగా.. ఈ కారణంగానే కోహ్లీ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.