Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ మిత్రుడు, ఆర్సీబీలో గతంలో రన్ మిషీన్తో కలిసి ఆడిన దక్షిణాఫ్రికా మాజీ సారథి ఏబి డివిలియర్స్.. విరాట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. కోహ్లీ – అనుష్క దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని చెప్పాడు. యూట్యూబ్ లైవ్లో మిస్టర్ 360 ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. శనివారం యూట్యూబ్ లైవ్లో పాల్గొన్న ఏబీడీ.. గర్భవతిగా ఉన్న అనుష్క శర్మతో సమయాన్ని గడిపేందుకే ఇంగ్లండ్తో రెండు టెస్టుల నుంచి కోహ్లీ విరామం తీసుకున్నట్టు వెల్లడించాడు.
స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నాడని బీసీసీఐ తెలిపిన విషయం తెలిసిందే. కోహ్లీ విషయంలో అభిమానులు, మీడియా గోప్యత పాటించాలని బీసీసీఐ కోరింది. అయితే కోహ్లీ తల్లికి ఆరోగ్యం బాగేలేదని, అతడు రాబోయే మూడు టెస్టులకూ అందుబాటులో ఉండడని వార్తలు వినిపిస్తున్న వేళ డివిలియర్స్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. యూట్యూబ్ లైవ్లో డివిలియర్స్ను కోహ్లీ ఫ్యాన్స్.. ‘హాయ్ సార్, మీరు ఇటీవలి కాలంలో విరాట్తో ఏమైనా మాట్లాడారా..? అతడు బాగానే ఉన్నాడా..? కోహ్లీ ఇంగ్లండ్తో మిగిలిన మూడు టెస్టులకు ఆడతాడా..? టీమిండియాకు అతడి అవసరం ఎంతైనా ఉంది..’ అని అడిగాడు.
AB De Villiers said, “Virat Kohli and Anushka Sharma are expecting their 2nd child, so Virat is spending time with his family”. (AB YT). pic.twitter.com/qurRKnFK1q
— Virat Kohli Fan Club (@Trend_VKohli) February 3, 2024
ఈ ప్రశ్నకు బదులిస్తూ.. ‘కోహ్లీ బాగానే ఉన్నాడు. అతడు తన ఫ్యామిలీతో గడుపుతున్నాడు. అందుకే అతడు ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. అవును, కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడు. కోహ్లీకి కుటుంబం అంటే చాలా ముఖ్యం. అందుకే అతడు ఈ సమయంలో తన భార్యతో గడుపుతున్నాడు. అంతకుమించి నేను ఏమీ చెప్పలేను..’ అంటూ ఖాయం చేశాడు. డివిలియర్స్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో కోహ్లీ మూడో టెస్టులో కూడా ఆడేది అనుమానమేనని అతడి అభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే మ్యాచ్లు మిస్ అయినా కోహ్లీ-అనుష్కలు రెండోసారి పేరెంట్స్ అవుతుండటంతో విరుష్క ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అనుష్క మూడేండ్ల క్రితం వామికకు జన్మనిచ్చిన విషయం విదితమే.