Vinesh Phogat | న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్కు సొంతగడ్డపై అపూర్వ స్వాగతం లభించింది. అందరూ ఊహించినట్లే పతక విజేతలకు మించి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి రెజ్లర్కు స్వాగతం పలికారు. శనివారం ఉదయం 10.30కు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఫోగాట్ కోసం సహచర రెజ్లర్లు సాక్షి మాలిక్, జబరంగ్ పునియాతో పాటు హర్యానా కాంగ్రెస్ లీడర్ దీపేందర్హుడా, పంచాయత్ సభ్యులు తరలివచ్చారు. ఓవైపు ‘డోల్’ చప్పుల మధ్య ఫ్యాన్స్ నృత్యాలు చేస్తూ వినేశ్పై పూల వర్షం కురిపించారు. అభిమానుల తాకిడి నేపథ్యంలో ఆమెకు మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఓపెన్టాప్ జీపులో బజరంగ్, సాక్షితో కలిసి అభిమానులకు అభివాదంచేస్తూ వినేశ్ ముందుకు సాగింది. ఈ క్రమంలో దీపేందర్ విజయానికి చిహ్నామైన గదను బహుకరించగా.. ఒకింత భావోద్వేగానికి లోనైన వినేశ్ను ఆమె భర్త సోమ్వీర్, సాక్షి, దీపేందర్ ఓదార్చారు. తన సొంత గ్రామమైన బలాలీకి చేరుకునే క్రమంలో ఢిల్లీలోని ద్వారక దేవాయలంలో వినేశ్ పూజలు చేసింది. మొత్తం 135 కి.మీ ప్రయాణానికి దాదాపు 10 గంటల సమయం పట్టగా, దారి మధ్యలో పలు కాప్ పంచాయతీలకు చెందిన సభ్యులు ఆమె ఆత్మీయంగా స్వాగతించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మీరు నాపై చూపించిన ప్రేమ, గౌరవం..1000 ఒలింపిక్ పసిడి పతకాలు గెలిచిన దాని కంటే ఎక్కువ’ అని చెమర్చిన కండ్లతో అంది. ఇదిలా ఉంటే ఇప్పటికే తన కెరీర్కు వీడ్కోలు పలికిన వినేశ్..కొనసాగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. కొద్దిరోజలు కుటుంబసభ్యులతో గడిపిన తర్వాత వినేశ్ ఏదో ఒక నిర్ణయానికి వస్తుందని సాక్షి మాలిక్ పేర్కొంది. వంద గ్రాముల అధిక బరువుతో అనర్హతకు గురైన వినేశ్కు అంతర్జాతీయ క్రీడాన్యాయస్థానం(కాస్)లో చుక్కెదురైన సంగతి తెలిసిందే. కాస్ తీర్పును వినేశ్ తిరిగి సవాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.