లండన్: ఇవాళ ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్యచేధనలో ఇంగ్లండ్ కూడా దూకుడుగానే కనిపించింది. ఓపెనర్లు జాసన్ రాయ్, డేవిడ్ మలాన్ 20 ఓవర్లలోపే 146 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో ఇంగ్లండ్ గెలుపు ఖాయమని అంతా భావించారు.
కానీ, ఊపు మీదున్న జాసన్ రాయ్ (113) ఔట్ కాగానే దక్షిణాఫ్రికా బౌలర్లు సిసాండ మగలా, ఎన్రిచ్ నార్జే, కాగిసో రబడా మరింత విజృంభించారు. ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ను పేకమేడలా కూల్చేశారు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఫీల్డ్ అంపైయిర్ మరాయిస్ ఎరాస్మస్ కొన్ని క్షణాలపాటు మ్యాచ్ జరుగుతున్న సంగతి మర్చిపోయారు.
దక్షిణాఫ్రికా బౌలర్ వేసిన బంతిని ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ ఎదుర్కొంటున్నప్పుడు అంపైయిర్ ఎరాస్మస్ పరధ్యానంలో వెనుకకు తిరిగి నిలబడ్డాడు. జాసన్ బ్యాట్తో బంతిని కొట్టిన శబ్దం వినబడగానే మళ్లీ ఈ లోకంలోకి వచ్చిన అంపైయిర్ టక్కున వెనక్కి తిరిగి చూశాడు. ఈ దృశ్యం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. నెటిజన్లను తెగ నవ్విస్తోంది. కేవలం 9 సెకన్ల నిడివిగల ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Marais Erasmus has no interest in ODI cricket at all 😅 #SAvENG pic.twitter.com/qnsjPe7A0j
— Farid Khan (@_FaridKhan) January 28, 2023