టోక్యో ఒలింపిక్స్కు నలుగురు భారత సెయిలర్లు అర్హత సాధించే వరకు.. విశ్వక్రీడల్లో ఈ క్రీడపై మనవాళ్లకు పెద్దగా ఆసక్తిలేదు. ఇప్పటి వరకు మన సెయిలర్లు ఆరుసార్లు ఒలింపిక్స్ బరిలో దిగగా.. 1988 సియోల్ క్రీడల్లో 17వ స్థానంలో నిలువడమే అత్యుత్తమం. అయితే ఇప్పటి వరకు ఆయా క్రీడల్లో ఒకే ఈవెంట్లో బరిలోకి దిగిన భారత సెయిలర్లు.. టోక్యోలో మాత్రం మూడు విభాగాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నేపథ్యంలో మన సెయిలర్లపై కథనం..
జకార్త వేదికగా జరిగిన 2018 ఆసియా క్రీడల్లో భారత సెయిలర్లు ఒక రజతం, రెండు కాంస్యాలు దక్కించుకోవడంతో దేశంలో జల క్రీడకు కాస్త క్రేజ్ పెరిగింది. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో తొలిసారి బరిలోకి దిగిన మన సెయిలర్లు.. మరో ఐదు సార్లు పోటీ పడ్డా రిక్తహస్తాలతోనే వెనుదిరిగారు. అయితే ఈ సారి విష్ణు శరవణన్ (పురుషుల స్టాండర్డ్ క్లాస్), నేత్ర కుమానన్ (మహిళల రేడియల్ క్లాస్) అంచనాల మధ్య టోక్యోలో అడుగు పెడుతున్నారు. పురుషుల స్కిఫ్ 49 ఈఆర్లో గణపతి చెంగప్ప-వరుణ్ ఠక్కర్ జోడీ కూడా జోరు మీద ఉంది.
ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గడం వీరి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. జాతీయ చీఫ్ కోచ్ ఇస్మాయిల్ బేగ్ శిక్షణలో రాటుదేలిన ఈ నలుగురు ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో సత్తాచాటడం ద్వారా విశ్వక్రీడలకు అర్హత సాధించారు. ఇక నేత్ర కుమానన్ భారత్ నుంచి ఒలింపిక్స్లో బరిలో దిగుతున్న తొలి మహిళా సెయిలర్గా రికార్డు సృష్టించనుంది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత, హైదరాబాదీ ఇస్మాయిల్ బేగ్.. నగరంలోని హుసేన్ సాగర్లో భారత సెయిలర్లు, రోయర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చాడు. టోక్యో క్రీడల లైట్ వెయిట్ డబుల్స్లో బరిలో దిగనున్న అర్జున్ లాల్-అర్వింద్ సింగ్ జోడీ కూడా ఇస్మాయిల్
బేగ్ వద్దే శిక్షణ పొందింది. భారత బృందం నుంచి పతక ఆశలు పెద్దగా లేకపోయినా.. మెరుగైన ప్రదర్శనతో భవిష్యత్తుపై భరోసా పెంచడం ఖాయంగా కనిపిస్తున్నది.
ఒలింపిక్స్లో మనవాళ్లు శరవణన్ (పురుషుల లేజర్ క్లాస్)
నేత్ర కుమానన్ (మహిళల రేడియల్ క్లాస్)
కేసీ గణపతి, వరుణ్ ఠక్కర్ (పురుషుల స్కిఫ్)