ICC Champions Trophy: 2025లో పాకిస్తాన్లో జరగాల్సి ఉన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వేదికలు మారుతాయా..? 2018 తర్వాత సుదీర్ఘకాలానికి జరగాల్సి ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు పాకిస్తాన్ అమితాసక్తి చూపుతున్నా భారత్ మాత్రం పాక్కు వెళ్లనని తెగేసి చెబుతుండటంతో ఈ టోర్నీ వేదికలు మారుతాయని కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా పీసీబీ చీఫ్ జకా అష్రఫ్.. దుబాయ్లో యూనైటైడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ఖలీద్ అలీ జరూనీతో సమావేశం అవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. దుబాయ్లో పీసీబీ చీఫ్తో పాటు ఐసీసీ జనరల్ కౌన్సిల్ జొనాథన్ హాల్తో పాటు ఖలీద్ అలీతో సమావేశమయ్యారు. ఈ ముగ్గురి సమావేశం వెనుక కారణం కూడా ఇదేనని పాకిస్తాన్ మీడియా కోడై కూస్తోంది.
ఎనిమిది జట్లతో ఆడబోయే ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ లోనే నిర్వహిస్తామని ఐసీసీ ఇదివరకే స్పష్టతవచ్చింది. అయితే పాకిస్తాన్తో సరిహద్దు సమస్యల కారణంగా భారత్.. దాయాది దేశానికి వెళ్లడం లేదు. ఇటీవలే ఆసియా కప్లో కూడా భారత్.. పాకిస్తాన్కు వెళ్లలేదు. దీంతో భారత్ మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరిగాయి. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా హైబ్రిడ్ మోడల్లోనే జరుగనుందని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడబోయే మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా జరుగుతాయని సమాచారం. మొత్తం టోర్నీని తరలించడం కంటే భారత్ మ్యాచ్లు మాత్రమే దుబాయ్లో నిర్వహిస్తే సరిపోతుందని పీసీబీ భావిస్తోంది. మరి దీనిపై పీసీబీ, బీసీసీఐ, ఐసీసీలు రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రకటన చేస్తాయో చూడాలి.