కైరో: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ టోర్నీ పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఆఖరి రోజు మరో రెండు పతకాలు మన ఖాతాలో చేరడంతో భారత్ తొలి స్థానంలో నిలిచింది. భారత ద్వయం రిథమ్ సాంగ్వాన్- అనీశ్ భన్వాల జోడీ స్వర్ణం.. మరో షూటర్ రామ్ రజతం కొల్లగొట్టారు. టోర్నీ ముగింపు రోజు సోమవారం 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రిథమ్- అనీశ్ జోడీ 17-7తో థాయిలాండ్ జోడీని చిత్తు చేయగా.. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో రామ్ 7-17తో జర్మనీ షూటర్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో తెలంగాణ షూటర్ ఇషాసింగ్ మూడు పతకాలతో సత్తా చాటిన విషయం తెలిసిందే. మొత్తం ఏడు పతకాల (4 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం)తో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.