రవీంద్రభారతి/నమస్తే ఆట ప్రతినిధి: జాతీయ స్థాయిలో రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసిన ప్లేయర్ల ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. గుజరాత్ వేదికగా ఈనెల 12వ తేదీతో ముగిసిన ప్రతిష్ఠాత్మక 36వ జాతీయ క్రీడల్లో సత్తాచాటిన రాష్ట్ర ప్లేయర్లను ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. శనివారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్గౌడ్ పతక విజేతలను శాలువాలతో సత్కరించి నగదు ఉత్తర్వులు అందజేశారు. పక్షం రోజుల పాటు జరిగిన టోర్నీలో తెలంగాణ ప్లేయర్లు వివిధ క్రీడా విభాగాల్లో 23 పతకాలు దక్కించుకున్నారు. పతకాల పట్టికలో తెలంగాణ ఓవరాల్గా 15వ స్థానంలో నిలిచింది. స్వర్ణానికి రూ.5 లక్షలు, రజతానికి రూ.3 లక్షలు, కాంస్యానికి రూ.2 లక్షలుగా ప్రభుత్వం ప్రోత్సాహం ప్రకటించింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ప్రతీ గ్రామం నుంచి ప్లేయర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆరువేల క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశాం. త్వరలో మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. వివిధ రాష్ర్టాల్లోని క్రీడా పాలసీలను అధ్యయనం చేసి అత్యుత్తమ విధానాన్ని తీసుకొస్తాం. జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన ప్లేయర్లకు అభినందనలు. భవిష్యత్లో మీరు మరిన్ని విజయాలు సాధించాలి. పతక విజేతలకు త్వరలోనే వారి అకౌంట్లలో నగదు ప్రోత్సాహకం జమ చేస్తాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు వేణుగోపాలచారి, కార్యదర్శి జగదీశ్వర్యాదవ్, ఉపాధ్యక్షుడు ప్రేమ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.