విశ్వక్రీడల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా టోక్యో పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు అద్వితీయ ప్రదర్శన కనబర్చారు. ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలతో ఓవరాల్గా 19 పతకాలు సాధించారు. టోక్యో విశ్వక్రీడలకు ముందు వరకు జరిగిన పారాలింపిక్స్ క్రీడలన్నింటిలో కలిపి 12 పతకాలే నెగ్గిన మనవాళ్లు.. తాజా క్రీడల్లోనే ఆ సంఖ్యను దాటి 19 పతకాలు కొల్లగొట్టడం విశేషం. ఆఖరి రోజు బ్యాడ్మింటన్లో కృష్ణ నాగర్ పసిడి పతకం సాధిస్తే.. సుహాస్ రజత సౌరభాలు వెదజల్లాడు.
టోక్యో: పారాలింపిక్స్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత అథ్లెట్లు.. ఓవరాల్గా 19 పతకాలతో టోక్యో క్రీడలను ముగించారు. అందులో ఐదు స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి. ‘విహంగాల్లా విహరిద్దాం’ అనే నినాదంతో సాగిన టోక్యో పారాలింపిక్స్లో భారత్ 24వ స్థానంలో నిలిచింది. విశ్వ వేదికపై మనకిదే ఉత్తమ ప్రదర్శన కావడం విశేషం. పోటీల చివరి రోజు ఆదివారం మన షట్లర్లు రెండు పతకాలు సాధించారు. కృష్ణ నాగర్ పసిడి పతకం కొల్లగొడితే.. నొయిడా జిల్లా మెజిస్ట్రేట్ సుహాస్ యతిరాజ్ రజతం కైవసం చేసుకున్నాడు. ఈ మెగాటోర్నీలో భారత్ నుంచి 54 మంది బరిలోకి దిగగా.. అందులో 17 మంది పతకాలు సాధించారు. షూటర్లు అవని, సింగ్రాజ్ రెండేసి పతకాలు చేజిక్కించుకున్నారు. రియో (2016) పారాలింపిక్స్లో భారత్ నుంచి 19 మంది పోటీ పడి నాలుగు పతకాలు సాధించగా.. ఈసారి దానికి నాలుగింతల పతకాలతో మనవాళ్లు అదరహో అనిపించారు. పారాలింపిక్స్లో కొత్త శకం ప్రారంభమైందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అంటే.. దేశాన్ని గర్వించేలా చేసిన వారందరికీ అభినందనలు అని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. పదమూడు రోజుల పాటు క్రీడాభిమానులను అలరించిన టో క్యో పారాలింపిక్స్ ఆదివారం ఘనంగా ముగిశాయి.
బంగారు కృష్ణయ్య
పారాలింపిక్స్ పోటీల ఆఖరి రోజు షట్లర్ కృష్ణ నాగర్ పసిడి పతకం సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఎస్హెచ్6 ఫైనల్లో కృష్ణ 21-17, 16-21, 21-17తో చూ మన్ కై (హాంకాంగ్)పై విజయం సాధించాడు. ‘నా కల నెరవేరింది. స్వర్ణం నెగ్గడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తు క్రీడల్లో ఇంతకుమించి ఫలితాలు వస్తాయి’ అని ఫైనల్ అనంతరం కృష్ణ పేర్కొన్నాడు. పతక రేసులో నిలిచిన మరో షట్లర్ సుహాస్ యతిరాజ్ ఫైనల్లో ఓడి రజతం చేజిక్కించుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ సుహాస్ యతిరాజ్ 21-15, 17-21, 15-21తో లూకాస్ మాజుర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు. మిక్స్డ్ డబుల్స్లో ప్రమోద్ భగత్-పాలక్ కోహ్లీ జంట కాంస్య పతక పోరులో ఓటమి పాలైంది.
19 పతకాలు నెగ్గిన భారత్
కృష్ణ నాగర్ది చారిత్రాత్మక ప్రదర్శన. బ్యాడ్మింటన్లో నువ్వు పతకం సాధించడం ద్వారా పారాలింపిక్స్లో త్రివర్ణ పతాకం మరింత ఎత్తుకు ఎదిగింది.
సుహాస్ యతిరాజ్కు అభినందనలు.
పౌర సేవకుడిగా సేవలందిస్తూనే.. క్రీడలను కొనసాగించడంలో మీ అంకితాబావం అసాధారణమైంది. కృష్ణ నాగర్ ఫీట్ ప్రతి భారతీయుడి ముఖంలో సంతోషాన్ని నింపింది.