టోక్యో: టోక్యో ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకలు శుక్రవారం జరగనున్నాయి. ఈసారి ఓపెనింగ్ సెర్మనీ చాలా సాదాసీదాగా జరగనున్నది. కరోనా ఆంక్షల నేపథ్యంలో .. ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం లేదు. ఎటువంటి ధగధగలు, హంగామా ఉండదని నిర్వాహకులు చెప్పారు. చాలా సీరియస్ అంశాలతో కళాత్మకంగా ఆరంభ వేడుకలు నిర్వహించనున్నారు. సామూహిక డ్యాన్సర్లు.. లైట్ షోలు లేకుండానే ఓపెనింగ్ సెర్మనీ ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మార్కో బాలిచ్ తెలిపారు. కానీ జపనీస్ కళాకృతులు మాత్రం ఆ సెర్మనీలో ఆకట్టుకుంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగినట్లుగా ప్రారంభోత్సవ వేడుకను రూపుదిద్దినట్లు ఆయన వెల్లడించారు. 2016లో జరిగిన రియో వేడుకలకు ఆయనే ఇంచార్జీగా ఉన్నారు. కరోనా వల్ల ఇప్పటికే ఈ క్రీడలను ఏడాది వాయిదా వేసి నిర్వహిస్తున్నారు. ఇక ఈసారి ప్రేక్షకులు లేకుండానే ఆరంభ వేడుక ఉంటుంది. ఖాళీ స్టేడియంలో అథ్లెట్లు పోటీపడనున్నారు. స్వల్ప సంఖ్యలో టీమ్ పరేడ్ నిర్వహించనున్నారు. కేవలం అథ్లెట్లు మాత్రమే ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొనే రీతిలో ఆ ఈవెంట్ను డిజైన్ చేశారు.