అద్భుతం ఆవిష్కృతమైంది. సుదీర్ఘ ఒలింపిక్స్ చరిత్రలో భారత్ చిరకాల కల సాకారమైంది. కోట్లాది మంది భారతీయుల స్వప్నం నెరవేరింది. వందేండ్ల నిరీక్షణకు తెరపడింది. అథ్లెటిక్స్లో సరికొత్త అధ్యాయానికి ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ వేదికైంది. అభిమానుల అంచనాలకు అనుగుణంగా జావెలిన్ త్రోలో హర్యానా యువ అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. స్వాతంత్య్ర భారతావని చరిత్రలో విశ్వక్రీడల అథ్లెటిక్స్లో దేశానికి తొలి పతకం అందించిన అరుదైన ఘనతను నీరజ్ సువర్ణాక్షరాలతో లిఖించాడు. బరిలోకి దిగిన తొలిసారే భారతీయుడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేస్తూ అత్యుత్తమ క్రీడావేదికపై మువ్వెన్నెల పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించాడు.
బీజింగ్(2008) ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా తర్వాత వ్యక్తిగత విభాగంలో భారత్కు రెండో పతకం అందించిన నీరజ్కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. బాహుబలి బజరంగ్ పునియా.. కాంస్య పోరులో ఏకపక్ష విజయంతో రెజ్లింగ్లో భారత్కు రెండో పతకాన్ని ఖాతాలో వేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా టోక్యో(2020) ఒలింపిక్స్లో భారత్ ఏడు పతకాలు వేసుకుని అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టింది. లండన్(2012) ఒలింపిక్స్ ప్రదర్శనను అధిగమిస్తూ మన ప్లేయర్లు కొత్త చరిత్రకు నాంది పలికిన తీరు నభూతో నభవిష్యత్. పారిస్(2024) విశ్వక్రీడల్లో భారత్ చరిత్ర తిరుగరాయాలని మనసారా కోరుకుందాం.
టోక్యో: యావత్ భారతావని ఎప్పుడెప్పుడా అని కండ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన అద్భుత క్షణాలకు టోక్యో వేదికైంది. ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటి వరకు అథ్లెటిక్స్లో ఒక్క పతకం కూడా సాధించని భారత్.. శనివారం చరిత్ర తిరగరాసింది. స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బరిసెను అల్లంత దూరానికి విసరిన క్షణాన దేశమంతా స్వర్ణ సంబురాల్లో మునిగిపోయింది. క్వాలిఫయర్స్లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు చేరిన నీరజ్ చోప్రా.. శనివారం జరిగిన తుదిపోరులో బరిసెను 87.58 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. విశ్వక్రీడల వ్యక్తిగత విభాగంలో భారత్కిది రెండో స్వర్ణం కాగా.. ఓవరాల్గా పదోది. ఇక అథ్లెటిక్స్లో భారత్కు ఒలింపిక్ పతకం దక్కడం ఇదే తొలిసారి. నీరజ్ గోల్డెన్ త్రోతో ఒలింపిక్స్ చరిత్రలో భారత్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకుంది. లండన్ (2012) ఒలింపిక్స్లో ఆరు పతకాలు సాధించిన భారత్.. ఈసారి ఆ సంఖ్యను ఏడుకు పెంచింది. ఇందులో ఓ స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలున్నాయి. ఇదే విభాగంలో చెక్ రిపబ్లిక్కు చెందిన జాకబ్ మాడ్లెచ్ (86.67 మీటర్లు), విటెస్లావ్ వెస్లీ (85.44 మీటర్లు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. బరిలోకి దిగిన తొలి ఒలింపిక్స్లోనే చరిత్ర సృష్టించిన 23 ఏండ్ల నీరజ్ చోప్రాకు.. దేశమంతా నీరాజనం పలుకుతున్నది. శతాబ్దాల నిరీక్షణకు తెరదించిన వీరుడా నీకు వందనం.. అభివందనం!
భారీ అంచనాల మధ్య ఫైనల్లో అడుగుపెట్టిన నీరజ్ తొలి ప్రయత్నంలోనే ఈటెను 87.03 మీటర్లు విసిరి భళా అనిపించాడు. తుదిపోరు బరిలో దిగిన 12 మంది అథ్లెట్లు ఈ దూరాన్ని నమోదు చేయలేకపోగా.. రెండో ప్రయత్నంలో నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఈ సారి ఈటెను ఏకంగా 87.58 మీటర్లు విసిరిన నీరజ్.. బరిసె తన చేయి వీడిన వెంటనే.. సంబురాలు చేసుకున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనవాడి ఆత్మవిశ్వాసం ఏపాటిదో. ఇక మూడో ప్రయత్నంలో 76.79 మీటర్లు విసిరిన నీరజ్.. తర్వాత రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యాడు. ఇక చివరి ప్రయత్నానికి ముందే స్వర్ణం ఖాయం కాగా.. ఆరోసారి 84.24 మీటర్ల దూరంతో పోటీని ముగించాడు. ఫేవరెట్గా బరిలోకి దిగిన జర్మనీ అథ్లెట్ 82.52 మీటర్ల దూరంతో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోగా.. పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ నదీమ్ 84.62 మీటర్లతో ఐదో ప్లేస్లో నిలిచాడు. పోటీ అనంతరం త్రివర్ణ పతాకాన్ని చేబూని మైదానమంతా కలియతిరిగిన నీరజ్.. అథ్లెటిక్స్లో భారత్ తొలి పతకం సాధించిన అపురూప క్షణాలను మరుపురానివిగా మలిచాడు.
ఒలింపిక్స్లో భారత పసిడి పతక కాంక్ష తీర్చిన నీరజ్ చోప్రాకు అతడి స్వరాష్ట్రం హర్యానా భారీ నజరానా ప్రకటించింది. నీరజ్కు రూ.6 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. దేశమంతా నీరజ్ విజయం పట్ల గర్వంగా ఉందన్న ఆయన.. ఒలింపిక్స్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన హర్యానా క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు అందజేయనున్నట్టు ప్రకటించారు. పంజాబ్ ప్రభుత్వం రూ.2 కోట్లు ప్రోత్సాహమిస్తున్నట్లు ప్రకటించింది. స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు బీసీసీఐ కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం ప్రకటించింది. అలాగే ఈ పోటీలలో రజతం సాధించిన భారత క్రీడాకారులు మీరాబాయి, రవి దహియాలకు రూ. 50 లక్షలు, కాంస్య పతకాలు నెగ్గిన పీవీ సింధు, లవ్లీనా, బజరంగ్ పునియాకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్టు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. పురుషుల హాకీ జట్టుకు కోటి 25లక్షలు నగదు ప్రోత్సాహకం ప్రకటించారు.
ఇది నేను నమ్మలేకపోతున్నా. అథ్లెటిక్స్లో భారత్కు తొలి స్వర్ణం కావున ఇవి దేశానికి నాకు ప్రత్యేకమైన క్షణాలు. అర్హత రౌండ్లో మంచి ప్రదర్శన చేశా. ఫైనల్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తానన్న ధీమాతోనే పోటీకి దిగా. కానీ స్వర్ణం గెలుస్తానని ఊహించలేదు. నేను చాలా ఆనందంగా ఉన్నా. ఈ పతకాన్ని దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్కు అంకితమిస్తున్నా. ఆయనతో పాటు
అథ్లెటిక్స్లో పతకానికి చేరువగా వచ్చిన వారందరికీ దీన్ని బహుమతిగా ఇస్తున్నా.
టోక్యోలో నీరజ్ మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించగా.. భారత జాతీయ గీతాలాపన జరుగుతున్న సమయంలో కదిలిపోని భారతీయుడు లేడంటే అతిశయోక్తికాదు. యావత్ జాతిని ఏకం చేసే సత్తా ఉన్న క్రీడా రంగానికి ఇది నవ శకారంభం. నీరజ్ స్వర్ణానికి బజరంగ్ కాంస్య వెలుగులు తోడవడంతో విశ్వక్రీడల చరిత్రలో భారత్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకుంది. శనివారంతో టోక్యోకు టాటా చెప్పేసిన భారత అథ్లెట్లు.. ఇక పారిస్(2024) ఒలింపిక్స్ కోసం సిద్ధం కానున్నారు.
ఒకటి కాదు రెండు కాదు.. ఓవరాల్గా వందేండ్లు! ఒకరా.. ఇద్దరా.. బరిలో దిగింది వందలాది మంది! విశ్వక్రీడల అథ్లెటిక్స్లో భారత చరిత్ర చెప్పుకోవాలంటే.. మిల్కాసింగ్, పీటీ ఉషా తప్ప మరో పేరు మనకు గుర్తు రాదు! ఇలాంటి దీన స్థితి నుంచి ఓ ధీరుడు వచ్చాడు..పతకం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అభిమానులకు భరోసానిస్తూ..ట్రాక్ అండ్ ఫీల్డ్లో మన ట్రాక్ రికార్డు మారుస్తూ..అన్నింటికంటే ముఖ్యంగా దివంగత దిగ్గజ స్ప్రింటర్ మిల్కాసింగ్ చివరి కోరికను తీరుస్తూ.. అథ్లెటిక్స్లో నీరజ్ స్వర్ణం నెగ్గాడు.ఏ పతకమైనా చాలు అనుకుంటున్న భారతావనికి
ఏకంగా పసిడి హారం తొడిగాడు.
శతకోటి భారతీయుల అంచనాల భారం మోస్తూ.. ముక్కోటి దేవతల ఆశీర్వచనాల మధ్య టోక్యో బరిలో దిగిన నీరజ్ చోప్రా ఒక్క త్రోతో దేశాన్ని ఆనంద డోలికల్లో ముంచెత్తాడు. ఆత్మవిశ్వాసం నిండిన కండ్లతో మైదానంలో అడుగు పెట్టిన నీరజ్ తొలి ప్రయత్నంలోనే బరిసెను అందరికంటే ఎక్కువ దూరం విసిరి అదుర్స్ అనిపించాడు. దేశమంతా టీవీలకు అతుక్కుపోయిన మధుర క్షణానా.. టోక్యో ఒలింపిక్ స్టేడియంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్న అద్వితీయ సందర్భంలో భావోద్వేగంతో కన్నీళ్లు రాల్చని క్రీడాభిమాని లేడంటే అతిశయోక్తి కాదు! ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో దేశానికి తొలి పతకాన్ని అందించిన వీరుడా.. అందుకో మా నీరాజనాలు!!
ఊబకాయంతో బాధపడుతున్న ఓ పన్నెండేండ్ల బాలుడు.. శరీరాకృతిని మెరుగు పర్చుకోమని కుటుంబ సభ్యులు పోరు పెడుతుండటంతో.. గ్రౌండ్కు వెళ్లడం ప్రారంభించాడు. జాగింగ్ చేయడానికి బద్దకించి ఓ మూలన కూర్చొని పక్కన జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్లను గమనించడమే పనిగా పెట్టుకున్నాడు. అలా హాయిగా కాలం గడిపేస్తున్న నీరజ్ను గమనించిన సీనియర్ అథ్లెట్ జై చౌదరి అతడి చేతికి బరిసెనిచ్చి విసరమని చెప్పాడు. అనాసక్తిగానే అందుకు అంగీకరించిన ఆ కుర్రాడు తొలి ప్రయత్నంలోనే మంచి ప్రతిభ కనబర్చాడు. దీంతో ‘నీ శరీరం ఈ ఆటకు అనువుగా ఉంది. ప్రయత్నిస్తే గొప్ప అథ్లెట్వి అవుతావు’ అని చౌదరి చెప్పిన మాటలు ఆ కుర్రాడి చెవికెక్కాయి. ఇక అప్పటి నుంచి ఒక్కో అడుగు ముందుకేస్తూ.. అంచెలంచెలుగా ఎదిగిన ఆ కుర్రాడే.. మన ఒలింపిక్ హీరో ‘సుబేదార్’ నీరజ్ చోప్రా.హర్యానాలోని పానిపట్ జిల్లా ఖంద్రా గ్రామంలోని ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన 23 ఏండ్ల నీరజ్.. అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనలతో అంచనాలు భారీగా పెంచాడు. బుధవారం క్వాలిఫయింగ్ రౌండ్లో 86.59 మీటర్ల దూరంతో నేరుగా ఫైనల్ చేరిన నీరజ్.. తుదిపోరులో తొలి ప్రయత్నంలోనే భారతీయుల హృదయాలతో పాటు టోక్యో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకంతో మెరిసిన యువ అథ్లెట్ నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురిసింది. మంత్రులు శ్రీనివాస్గౌడ్, హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్రెడ్డి..నీరజ్ అద్భుత ప్రదర్శనను కొనియాడారు. బంగారు పతకంతో యావత్ దేశం గర్వపడేలా చేశాడని చోప్రాను కీర్తించారు. మరోవైపు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, జాతీయ హ్యాండ్బాల్ సంఘం(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు, జాతీయ అథ్లెటిక్స్ టెక్నికల్ కమిటీ చైర్మన్ స్టాన్లీ జోన్స్..నీరజ్ పసిడి పతక ప్రదర్శనను అభినందనల్లో ముంచెత్తారు.
అపూర్వమైన గెలుపు నీరజ్ చోప్రా. నీవు చరిత్ర సృష్టించావు. మొదటి ఒలింపిక్స్లోనే భారత్కు ట్రాక్ అండ్ ఫీల్డ్లో తొలి పతకాన్ని తీసుకొస్తున్నావు. నీ ప్రదర్శన యువతకు స్ఫూర్తి.. దేశం గర్వంతో ఉప్పొంగిపోతుంది. హృదయపూర్వక అభినందనలు.
–రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
టోక్యోలో చరిత్ర సృష్టించావు. ఈరోజు నీరజ్ చోప్రా సాధించిన విజయం చిరకాలం గుర్తుండిపోతుంది. నీరజ్ చాలా చక్కగా రాణించాడు. ఆటపట్ల ఫ్యాషన్తో తనదైన శైలిలో ఆడి స్వర్ణం నెగ్గిన నీరజ్కు అభినందనలు.
–ప్రధాని నరేంద్ర మోదీ
ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో వందేండ్లుగా పతకం కోసం ఎదురుచూస్తున్న భారతీయుల కలలను యువ అథ్లెట్ నీరజ్ చోప్రా నిజం చేశాడు. అతని విజయం దేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. టోక్యో విశ్వక్రీడల్లో భారత ప్లేయర్లు విశేష ప్రతిభ కనబరచడం సంతోషకర విషయం.
–సీఎం కేసీఆర్
ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో భారత్కు తొలి పతకాన్ని అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు అభినందనలు. భారత దేశం నిన్ను చూసి గర్విస్తున్నది.
–రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్
స్వర్ణం సాధించాలన్న దేశ ప్రజల
కోరికను సాధించిన నీరజ్కు అభినందనలు. ఎన్నో ఏండ్లుగా వేచి చూస్తున్న రోజు ఇది. నువ్వు చరిత్ర సృష్టించావు.
గోల్డెన్ క్లబ్కు స్వాగతం.
–అభినవ్ బింద్రా
నువ్వు సాధించిన విజయం వల్ల భారత్ ఈరోజు తేజోవంతంగా వెలుగుతున్నది. నువ్వు విసిరిన త్రో తో మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. ప్రతి భారతీయుడిని గర్వించేలా చేశావు.
–సచిన్ టెండూల్కర్
87.58 మీ.గోల్డెన్ త్రో
విశ్వక్రీడల అథ్లెటిక్స్లో భారత్కు తొలి పతకం
చరిత్ర తిరగరాసిన జావెలిన్ త్రోయర్
బజరంగ్కు కాంస్యం అదితికి నాలుగో స్థానం
ఒలింపిక్స్లో 7 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన