పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన మరుసటి రోజే మహిళల హాకీ జట్టు కూడా చరిత్ర సృష్టిస్తుందనుకున్న భారత అభిమానులకు నిరాశ ఎదురైంది. అంచనాలు లేని స్థితి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఇక్కడి వరకు వచ్చిన రాణి రాంపాల్ బృందం ప్లే ఆఫ్స్ మ్యాచ్లో తుదికంటా పోరాడినా.. చివరకు ఓటమి వైపు నిలువాల్సి వచ్చింది.
ఆట అన్నాక గెలుపోటములు సహజమే కాగా.. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రత్యర్థి ప్లేయర్లు సైతం మోకాళ్లపై కూర్చొని మన అమ్మాయిలను అభినందించారంటే.. మనవాళ్ల ఆట ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్ మ్యాచ్కు పరిణితి సాధిస్తూ రాణి పరివారం సాగించిన ప్రయాణం.. భావితరాలకు బంగారు బాట వేస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
యావత్ భారతావనిని పులకరింప చేస్తూ.. టోక్యోలో రాణి రాంపాల్ బృందం పతకం గెలువకున్నా.. తమ పోరాట స్ఫూర్తితో అభిమానుల మనసులు గెలుచుకుంది. బ్రిటన్ చేతిలో భంగపాటు ఎదురైనా.. విశ్వక్రీడల చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శనతో అదుర్స్ అనిపించింది. దేశ ప్రధానే.. మీరు హాకీకి తిరిగి ఊపిరిలూదారనడం కంటే పెద్ద పతకం ఏం ఉంటుంది! భళా అమ్మాయిలు..మీ పోరాట స్ఫూర్తికి మేం ఫిదా!!
కాంస్య పోరులో ఓడిన అమ్మాయిలకు ప్రధాని మోదీ ధైర్యం చెప్పారు. నిరాశ చెందొద్దని, మహిళల జట్టును చూసి దేశం గర్విస్తున్నదని వారితో అన్నారు. మ్యాచ్ అనంతరం జట్టుతో ఫోన్లో మాట్లాడిన మోదీ.. ‘మీరంతా చాలా బాగా ఆడారు. గత ఐదేండ్లుగా మీరు అన్నీ వదిలి ఆట కోసమే చెమటోడ్చారు. మీ కష్టం దేశానికి పతకాన్ని తీసుకురాలేకపోయినా మీ పోరాటం మాత్రం కోట్లాది మంది యువతులకు స్ఫూర్తిగా నిలిచింది’ అని వారితో అన్నారు. ఈ సమయంలో ఫోన్లో కొంతసేపు నిశ్శబ్దం రావడంతో అది గమనించిన మోదీ.. ‘మీరు ఏడవొద్దు. దేశం మొత్తం మిమ్మల్ని చూసి గర్విస్తున్నది. హాకీ పునరుజ్జీవం పోసుకుంది. ఇదంతా మీ కృషి వల్లే’ అని వారిలో ధైర్యం నింపారు.
టోక్యో: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో పతకం పట్టి మహిళల హాకీ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించాలనుకున్న భారత జట్టుకు నిరాశ ఎదురైంది. శుక్రవారం జరిగిన ప్లే ఆఫ్స్ మ్యాచ్లో తుదికంటా పోరాడిన మన అమ్మాయిలు 3-4తో డిఫెండింగ్ చాంపియన్ గ్రేట్ బ్రిటన్ చేతిలో ఓటమి పాలయ్యారు. పతకం పట్టకపోయినా.. విశ్వక్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మన అమ్మాయిలు దేశంలో హాకీకి తిరిగి జవసత్వాలు నింపారు. ఇప్పటి వరకు మూడుసార్లు ఒలింపిక్స్ బరిలో దిగిన భారత జట్టు.. 1980 మాస్కో విశ్వక్రీడల్లోనూ నాలుగో స్థానం (పాల్గొన్నవి ఆరే జట్లు)లో నిలిచింది. తొలిసారి ఒలింపిక్స్ సెమీఫైనల్కు చేరడం ద్వారా ఇప్పటికే చరిత్రకెక్కిన రాణి రాంపాల్ బృందం.. ఆఖరికి నాలుగో స్థానంతో టోక్యో ప్రస్థానాన్ని ముగించింది. కీలక పోరులో భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (25వ, 26వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో ఆకట్టుకోగా.. వందన కటారియా (29వ ని)ఓ గోల్ కొట్టింది. ప్రత్యర్థి జట్టు తరఫున ఎలెనా రాయెర్ (16వ నిమిషంలో), సారా రాబర్ట్సన్ (24వ ని), హొలీ వెబ్ (35వ ని), గ్రేస్ బాడ్సన్ (48వ ని) ఒక్కో గోల్ చేశారు. మరోవైపు స్వర్ణ పతక పోరులో అర్జెంటీనాను చిత్తుచేసిన నెదర్లాండ్స్ నయా చాంపియన్గా అవతరించింది.
అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత గోల్ఫర్ అదితి అశోక్ విశ్వక్రీడల్లో సంచలన ప్రదర్శన కొనసాగిస్తున్నది. శుక్రవారం మూడో రౌండ్ పూర్తయ్యేసరికి అదితి
201 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన కొర్డా నెల్లీ టాప్లో ఉన్నది. మహిళల వ్యక్తిగత స్ట్రోక్ప్లే తొలి రౌండ్లో 67 పాయింట్లు సాధించిన అదితి.. ఆ తర్వాత వరుసగా 66, 68 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. శనివారం కీలకమైన నాలుగోరౌండ్ జరుగనుండగా.. అదితి ఇదే జోరు కొనసాగిస్తే.. భారత్ ఖాతాలో పతకం చేరడం ఖాయమే. మరో భారత గోల్ఫర్ దీక్ష దాగర్ 51వ స్థానంలో కొనసాగుతున్నది.
భారీ అంచనాల మధ్య ఒలింపిక్స్ బరిలో దిగిన.. రెజ్లింగ్ ‘బాహుబలి’ బజరంగ్ పునియా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక సెమీఫైనల్లో పరాజయం పాలయ్యాడు. పురుషుల ఫ్రీైస్టెల్ 65 కేజీల సెమీఫైనల్లో బజరంగ్ 5-12తో మూడుసార్లు ప్రపంచ చాంపియన్ హాజీ అలీ (అజర్బైజాన్) చేతిలో ఓడాడు. బజరంగ్ కాళ్ల కదలికల బలహీనతను సొమ్ముచేసుకున్న హాజీ సునాయాసంగా విజయం సాధించగా.. ఇక కాంస్య పతకం కోసం బజరంగ్ శనివారం మరోసారి మ్యాట్పై అడుగుపెట్టనున్నాడు. ఆరంభంలో వెనుకంజలో ఉండి.. ఆఖర్లో చెలరేగే బజరంగ్ వ్యూహం ఈసారి బెడిసికొట్టింది. తొలి రౌండ్ ముగిసేసరికి 1-4తో వెనుకంజలో పడ్డ బజరంగ్.. ఆ తర్వాతైనా కోలుకుంటాడని అనుకుంటే.. హాజీ ఉడుం పట్టుతో ఆధిక్యాన్ని 8-1కి పెంచుకున్నాడు. బజరంగ్ కాళ్లనే లక్ష్యంగా చేసుకున్న హాజీ.. వరుస పాయింట్లతో దూసుకెళ్లాడు. చివరి 30 సెకన్లలో బజరంగ్కు పట్టు చిక్కినా.. విజయానికి అవసరమైన పాయింట్లు మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. అంతకుముందు తొలి రౌండ్లో కిర్గిస్థాన్కు చెందిన అక్మతాలివ్ ఎర్నాజర్పై ‘టెక్నికల్ సుపీరియారిటీ’తో విజయం సాధించిన బజరంగ్.. క్వార్టర్ ఫైనల్లో మొర్తజా ఘాజీ (ఇరాన్)పై గెలిచి సెమీస్లో అడుగుపెట్టాడు. తొలి రెండు బౌట్లలో ప్రత్యర్థుల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాని బజరంగ్కు సెమీస్లో చుక్కెదురైంది. ఇక మహిళల విభాగంలో తొలిసారి ఒలింపిక్స్ బరిలో దిగిన సీమా బిస్లా (50 కేజీలు) తొలి రౌండ్లో 1-3తో సారా హందీ చేతిలో ఓటమి పాలైంది. టోక్యో విశ్వక్రీడల రెజ్లింగ్లో ఇప్పటి వరకు భారత్ తరఫున రవి దహియా (57 కేజీలు) రజత పతకం సాధించగా.. శనివారం కాంస్యం కోసం బజరంగ్ బరిలో దిగనున్నాడు.
మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు ఆధిపత్యం కోసం ప్రయత్నించడంతో తొలి క్వార్టర్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. బ్రిటన్ పదే పదే చేసిన ప్రయత్నాలను భారత గోల్ కీపర్ సవితా పునియా సమర్థవంతంగా అడ్డుకుంది. ఇక రెండో క్వార్టర్ ఆరంభంలోనే ఎలెనా రాయెర్ గోల్తో ఖాతా తెరిచిన బ్రిటన్.. 24వ నిమిషంలో రెండో గోల్ కొట్టి ఆధిక్యాన్ని డబుల్ చేసుకుంది. ఈ దశలో నాలుగు నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్తో మనవాళ్లు ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేశారు. 25వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్ను గుర్జీత్ గోల్గా మలచడంతో భారత్ బోణీ కొట్టగా.. రెండు నిమిషాల వ్యవధిలో సలీమా కృషితో వచ్చిన మరో పెనాల్టీ కార్నర్ను కూడా గుర్జీత్ విజయవంతంగా గోల్పోస్ట్లోకి పంపింది. ఇదే జోరులో వందన కటారియా అద్భుత ఫీల్డ్గోల్తో భారత్ ఆధిక్యాన్ని పెంచింది. ఫలితంగా రెండో క్వార్టర్ ముగిసే సరికి భారత్ 3-2తో ఆధిక్యంలో నిలిచింది. అయితే చివరి రెండు క్వార్టర్స్లో మనవాళ్లు ఒక్క గోల్ కూడా కొట్టలేకపోగా.. బ్రిటన్ మరో రెండు గోల్స్ కొట్టి కాంస్య పతకం సొంతం చేసుకుంది.
బ్రిటన్తో కాంస్య పతక పోరులో పోరాడి ఓడి న టీమ్ఇండియా జట్టులో తమ రాష్ర్టానికి చెందిన 9 మంది ప్లేయర్లకు హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ శుక్రవారం నగదు ప్రోత్సాహం ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దీప్గ్రేస్ ఎక్కా, నమితా తొపోకు రూ.50వేల నగదు ఇవ్వనున్నట్లు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు.
వందేండ్లకు పైగా చరిత్ర కల్గిన ఒలింపిక్స్లో భారత్కు అథ్లెటిక్స్లో పతకం అందని ద్రాక్షగానే ఊరిస్తున్నది. తరాలు మారుతున్నా.. దశాబ్దాలు గడుస్తున్నా పతక నిరీక్షణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. విశ్వక్రీడల్లో భారత సుదీర్ఘ కల సాకారమయ్యే సమయం ఆసన్నమైందా. అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. జావెలిన్ త్రోలో యువ అథ్లెట్ నీరజ్ చోప్రా అంచనాలకు అనుగుణంగా ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అర్హత రౌండ్లో ఈటెను 86.59 మీటర్లు విసిరి గ్రూపు-ఎ నుంచి అలవోకగా తుదిపోరుకు అర్హత సాధించాడు. చోప్రా ఇదే ప్రదర్శనను పునరావృతం చేస్తే.. ఇన్నేండ్లకు ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో భారత్ బోణీ కొట్టినట్లే. కోట్లాది మంది అభిమానుల ఆశలు నెరవేరాలని మనమూ ఆశిద్దాం.
పురుషుల 4×400 మీటర్ల పరుగులో చక్కటి ప్రదర్శన కనబర్చిన భారత జట్టుకు ఫైనల్ చేరే అవకాశం తృటిలో చేజారింది. మహమ్మద్ అనస్, నిర్మల్, రాజీవ్, జాకబ్లతో కూడిన భారత జట్టు.. శుక్రవారం జరిగిన హీట్-2లో 3:00.25 సెకన్లలో లక్ష్యాన్ని చేరి నాలుగో స్థానంలో నిలిచింది. ఓవరాల్గా ఎనిమిది జట్లు తుదిపోరుకు అర్హత సాధించగా.. భారత్ తొమ్మిదో ప్లేస్తో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో మనవాళ్లు ఆసియా రికార్డు (ఖతార్ జట్టు 3:00.56 సె, 2018 ఏషియన్ గేమ్స్)ను తిరుగరాయడం విశేషం. మరోవైపు 50 కిలోమీటర్ల రేస్వాక్లో భారత వాకర్ గుర్ప్రీత్ సింగ్ రేసును పూర్తి చేయలేకపోయాడు. 35 కిలోమీటర్ల అనంతరం కండరాలు పట్టేయడంతో పోటీ నుంచి తప్పుకున్నాడు.