టోక్యో: ఒలింపిక్స్ ( Tokyo Olympics ) ఘనంగా ముగిశాయి. 19 రోజులపాటు మొత్తం ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ ఆటల పండుగ.. ఆదివారం క్లోజింగ్ సెర్మనీతో సాయొనారా (గుడ్బై) చెప్పింది. ముగింపు సందర్భంగా మరోసారి అన్ని దేశాలకు చెందిన అథ్లెట్లు తమ జాతీయ పతాకాలతో స్టేడియంలోకి వచ్చారు. ఇండియా తరఫున బ్రాంజ్ మెడల్ విన్నర్, రెజ్లర్ భజరంగ్ పూనియా త్రివర్ణ పతాకంతో సందడి చేశాడు. కరోనా మహమ్మారి వణికస్తున్న సమయంలో విజయవంతంగా ఈ విశ్వక్రీడా సంబరాన్ని నిర్వహించిన టోక్యోకు అథ్లెట్లు కృతజ్ఞతలు తెలిపారు. క్లోజింగ్ సెర్మనీ ప్రారంభంలో జపాన్ క్రౌన్ ప్రిన్స్ అకిషినో, ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్తో కలిసి స్టేడియంలోకి వచ్చారు.
మూడేళ్ల తర్వాత 2024లో ఈ గేమ్స్ను నిర్వహించడానికి ఫ్రాన్స్ రాజధాని పారిస్ సిద్ధమవుతోంది. క్లోజింగ్ సెర్మనీ సందర్భంగానే మెన్స్, వుమెన్స్ మారథాన్ విజేతలకు మెడల్స్ అందజేశారు. కెన్యాకు చెందిన పెరెస్ జెప్చిర్చిర్ మహిళల మారథాన్ విజేతగా నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో కెన్యాకే చెందిన బ్రిగిడ్ కోస్గీ , మూడో స్థానంలో మోలీ సీడెల్ నిలిచింది. ఇక పురుషుల మారథాన్ టైటిల్ నిలబెట్టుకున్నాడు కెన్యాకు చెందిన కిప్చోగె. నెదర్లాండ్స్కు చెందిన నగీయె, బెల్జియంకు చెందిన అబ్ది రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.