ఈ మెగాటోర్నీ కోసం జపాన్ ప్రభుత్వం దాదాపు లక్ష కోట్లు ఖర్చుపెడుతున్నది.
ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న క్రీడలకు ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో.. అథ్లెట్లలో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రత్యేకంగా రోబోలతో స్టేడియాలను నింపనున్నారు. అంటే ఇప్పటి వరకు అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య పోటీలు జరిగితే.. కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి మరతాళ ధ్వనులు మార్మోగనున్నాయి.
పోడియంపై గ్రూప్ ఫొటోలకు ఫొజునిచ్చే సంప్రదాయానికి ఈ క్రీడలు స్వస్తి పలుకనున్నాయి.
తప్పనిసరితో పాటు ముగ్గురి మధ్య కూడా పలకలను అడ్డుగా ఉంచనున్నారు.
పతకాలు సాధించిన అథ్లెట్లు రోబోలు తీసుకొచ్చే పతకాలను ఎవరికి వారే మెడలో వేసుకోనున్నారు.
పాడైపోయిన ఎలక్ట్రానిక్ పరికాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా ఈ సారి ఒలింపిక్ పతకాలను తయారు చేశారు. పాత ల్యాప్టాప్లు, ఫోన్లు, కెమెరాలు.. ఇలా జపాన్ వాసుల నుంచి సేకరించిన 79 టన్నుల వ్యర్థాలను రీ సైకిల్ చేసి 5 వేలకు పైగా పతకాలను సిద్ధం చేశారు.
టోక్యో: విశ్వ క్రీడాపండుగ టోక్యో ఒలింపిక్స్కు సర్వం సిద్ధమైంది. కరోనా వైరస్ నేపథ్యంలో కట్టుదిట్టమైన నిబంధనల మధ్య ప్రేక్షకులు లేకుండా శుక్రవారం విశ్వక్రీడలు ప్రారంభమవన్నాయి. జపాన్లో కరోనా మరోసారి విజృంభిస్తుండడంతో చివరి నిమిషం దాకా ఒలింపిక్స్ జరుగుతాయా లేదా అన్న అనుమానాలు రేగినా.. ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం, అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐవోసీ), నిర్వాహకులు చెప్పిన విధంగానే క్రీడలకు అంకురార్పన చేసేందుకు సంకల్పించారు. మరోవైపు ఒలింపిక్స్ గ్రామంలో అన్ని దేశాల అథ్లెట్లు, ప్రతినిధులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తుండడంతో పాటు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. ముఖ్యంగా 80 శాతం మంది అథ్లెట్లకు వ్యాక్సినేషన్ పూర్తవడంతో క్రీడలు సజావుగా సాగుతాయనే భరోసా ఉంది. మొత్తంగా ఆగస్టు 8 వరకు జరిగే ఒలింపిక్స్లో 11,500 మంది అథ్లెట్లు తలపడనున్నారు. 42 వేదికల్లో జరిగే విశ్వక్రీడల్లో 205 దేశాలతో పాటు ఓ శరణార్థి జట్టు కూడా పాల్గొననుంది. ప్రారంభ వేడుకలను జపాన్ చక్రవర్తి నరుహిటో ప్రారంభించనున్నారు.
అట్టహాసం, అంబరాన్నంటే సంబురాలు లేకుండా లాంఛనప్రాయంగానే శుక్రవారం టోక్యో ప్రధాన స్టేడియంలో విశ్వక్రీడల ఆరంభం ఉండనుంది. పరిమిత సంఖ్యలో అథ్లెట్లు, అధికారులు మాత్రమే హాజరుకానున్నారు. ఆరంభ వేడుకకు భారత్ తరఫున 20 మంది అథ్లెట్లు, ఆరుగురు అధికారులు పాల్గొననున్నారు. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ భారత పతాకదారులుగా వ్యవహరించనున్నారు. కాగా అధికారులు, జర్నలిస్టులు, ముఖ్య అతిథులు మొత్తం 950 మంది ఆరంభ వేడుకలను వీక్షించనున్నారు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు టోక్యోలో కరోనా కొత్త కేసుల సంఖ్య రెండు వేలకు చేరువైంది. ఇదిలాఉండగా టోక్యో ఒలింపిక్ గ్రామంలో మరో ఇద్దరు అథ్లెట్లకు కరోనా సోకింది.దీంతో క్రీడాగ్రామంలో కేసుల సంఖ్య 87కు చేరింది.
విశ్వక్రీడా సంరంభంలో తొలి రోజే భారత్ తన పతకాల వేటకు గురి పెట్టనుంది. ఉదయం యుమేనొషిమా పార్క్ ఆర్చరీ ఫీల్డ్లో.. మహిళల, పురుషుల వ్యక్తిగత అర్హత రౌండ్లు జరుగనున్నాయి. భారత్కు ఈసారి కచ్చితంగా పతకాలు రాగలవన్న క్రీడలలో ఆర్చరీ కూడా ఉంది. ఆర్చరీలో ప్రపంచ నంబర్వన్ ర్యాంకర్ దీపికా కుమారితో పాటు ఆమె భర్త అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్దీప్ రాయ్ బరిలోకి దిగనున్నారు. ఒలింపిక్స్లో భారత్కు ఇప్పటిదాకా ఆర్చరీలో ఒక్క పతకం కూడా రాలేదు.
ఫామ్లో భారత అథ్లెట్లు.. పతకాల పంటకు సిద్ధం అంతటా ఒకే మాట.. టోక్యో ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు చరిత్ర సృష్టించడం ఖాయమేనని.. దేశానికి అత్యధిక పతకాలు తీసుకురావడం తథ్యమని. మన అథ్లెట్ల ఇటీవలి ప్రదర్శన.. మునుపెన్నడూ లేని విధంగా 120కి పైగా మంది అర్హత సాధించడం.. ప్రస్తుత పరిస్థితులు కూడా ఇదే జరుగబోతోందని సంకేతాలిస్తున్నాయి. ముఖ్యంగా షూటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ సహా మరిన్ని క్రీడల్లో పతకాల పంట పండే అవకాశం ఉంది. చీర్ ఫర్ ఇండియా అని నినదిస్తున్న 130 కోట్ల మంది భారతీయుల మద్దతుతో టోక్యోలో మన అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేయాలని ఆశిద్దాం.
బ్యాడ్మింటన్లో తెలుగు ప్లేయర్, రియో ఒలింపిక్స్ రజత విజేత పీవీ సింధు ఫేవరెట్గా ఉంది. గతేడాది స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినా.. విశ్వక్రీడల కోసం తీవ్రంగా శ్రమించిన సింధు సత్తాచాటేందుకు కసిగా ఉంది. కాగా గత ఒలింపిక్స్ ఫైనల్లో తనను ఒడించిన కరోలినా మారిన్ పోటీల్లో లేకపోవడమూ ప్రపంచ చాంపియన్ సింధుకు కలిసొచ్చే అంశమే. మరోవైపు ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్.. డబుల్స్లో ఫుల్ఫామ్లో ఉన్న సాత్విక్ – చిరాగ్శెట్టి అద్భుతం చేస్తారేమో చూడాలి.
షూటర్లపై గంపెడాశలు ఉన్నాయి. ప్రపంచ టోర్నీల్లో సత్తాచాటిన మన షూటర్లు ఒలింపిక్స్లో స్వర్ణ మెరుపులు మెరిపిస్తారని అంచనాలున్నాయి. యువ సంచలనం ఎలావెనిల్ వలరివన్, మనూబాకర్, సౌరభ్ చౌదరి, దివ్యాంశ్ సింగ్ పన్వర్పై ఆశలు నెలకొన్నాయి. వ్యక్తిగత విభాగాలతో పాటు టీమ్ఈవెంట్లోనూ పతకాలు రావడం ఖాయమనే చెప్పవచ్చు. బాక్సింగ్లో
మేరీకోమ్, అమిత్ పంగల్ పతకం కొట్టేందుకు పట్టుదలగా ఉన్నారు. ఫామ్లో ఉన్న పురుషుల, మహిళల హాకీ జట్లు అద్భుతం చేయాలని ఆశిస్తున్నాయి.
రెజ్లింగ్లో భారత్కు కనీసం మూడు పతకాలు పక్కా అనే అంచనాలున్నాయి. పురుషుల విభాగంలో బజరంగ్ పునియా (65 కేజీలు), మహిళల పోటీలో వినేశ్ ఫోగట్ (53 కేజీలు) స్వర్ణంపై కన్నేశారు. దీపక్ పూనియా, రవి దహియ పతకం సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరోవైపు వెయిట్ లిఫ్టింగ్లో రికార్డులు లిఖిస్తున్న మీరాబాయి చానూ మెడల్ పట్టే అవకాశం మెండుగా ఉంది. అథ్లెటిక్స్లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై.. మహిళల పరుగులో ద్యుతీచంద్పై ఆశలున్నాయి.
సాంకేతికతలో ప్రపంచం కంటే ఒక అడుగు ముందుండే జపాన్.. విశ్వక్రీడల ఆతిథ్యంలోనూ ఇదే కొనసాగించాలనుకుంటున్నది. మస్కట్ల నుంచి సహాయకుల దాకా స్టేడియంలో ఎక్కడ చూసినా రోబోలే కనిపించే విధంగా రూపకల్పన చేస్తున్నది. రోబోలతో మర యంత్రాలను రూపొందించి వదిలేయకుండా.. త్రీడీ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీలతో జీవం ఉట్టిపడేలా తయారు చేశారు.
కరోనా కారణంగా విశ్వక్రీడలు వాయిదా పడటంతో ఖర్చు తగ్గించుకోవడంతో పాటు మళ్లీ ఉపయోగించేందుకు వీలయ్యే కార్డు బోర్డులతో క్రీడాగ్రామంలోని పడకలను రూపొందించారు. మెగా టోర్నీ తర్వాత వీటిని రీ సైకిల్ చేయనున్నారు.
టోక్యో సిటీ సమ్మర్ ఒలింపిక్స్కు ఆతిథ్యమివ్వడం ఇది రెండోసారి. గతంలో 1964లో తొలిసారి జపాన్ విశ్వక్రీడలకు వేదికైంది. దీంతో పాటు 1972 (సపోరో), 1998 (నగానో)లో వింటర్ ఒలింపిక్స్ జపాన్లోనే జరిగాయి.