IND vs AUS | చాన్నాళ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడేందుకు భారత మహిళల క్రికెట్ జట్టు మరో రెండడుగుల దూరంలో నిలిచింది. గత టీ20 ప్రపంచకప్ (2020) ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీమ్ఇండియా.. ఈసారి సెమీఫైనల్లోనే కంగారూలతో తలపడనుంది. ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని హర్మన్ప్రీత్ కౌర్ బృందం భావిస్తుంటే.. వరుస విజయాల జోష్లో ఉన్న ఆస్ట్రేలియా మరోసారి ఫైనల్ చేరేందుకు రెడీ అయింది. బలాబలాల పరంగా చూసుకుంటే మన అమ్మాయిల కంటే ఆస్ట్రేలియా మెరుగ్గా కనిపిస్తున్నా.. 2017 వన్డే ప్రపంచకప్ సెమీస్ సీన్ రిపీట్ చేయాలని భారత అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
కేప్ టౌన్: భారీ ఆశలతో ప్రపంచకప్ బరిలోకి దిగిన భారత మహిళల జట్టు.. అసలు సిసలు పోటీకి సిద్ధమైంది. గత కొన్నాళ్లుగా కొరుకుడుపడని కొయ్యలా మారిన ఆస్ట్రేలియాతో మన అమ్మాయిలు గురువారం తొలి సెమీఫైనల్లో తలపడనున్నారు. గ్రూప్-1లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచిన ఆస్ట్రేలియా అజేయంగా సెమీస్ చేరగా.. గ్రూప్-2 నుంచి మూడు విజయాలతో రెండో స్థానంలో భారత్ సెమీఫైనల్కు అర్హత సాధించింది. లీగ్ దశలో పాకిస్థాన్, వెస్టిండీస్, ఐర్లాండ్పై విజయాలు సాధించిన టీమ్ఇండియా.. ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఇటీవల ఐసీసీ తొలిసారి ప్రవేశ పెట్టిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకున్న భారత్.. సీనియర్ స్థాయిలో తొలి కప్పు చేజిక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. గత మూడు పర్యాయాలు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరిన టీమ్ఇండియా.. 2020లో రన్నరప్గా నిలిచింది. అప్పుడు ఆసీస్ చేతిలోనే దెబ్బతిన్న హర్మన్ప్రీత్ బృందం ఈసారి దెబ్బకు దెబ్బ కొట్టాలని కృతనిశ్చయంతో ఉంది. కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లోనూ ఆసీస్ చేతిలో ఓడిన భారత జట్టు రజత పతకంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. గత ఐదేండ్ల ప్రదర్శన చూసుకుంటే.. ఆసీస్ జట్టు అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్నది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 30 టీ20 మ్యాచ్ల్లో కంగారూలు 22 మ్యాచ్లు నెగ్గగా.. మనవాళ్లు ఆరింట మాత్రమే విజయం సాధించారు. దక్షిణాఫ్రికా పిచ్లపై అండర్-19 ప్రపంచకప్ ఆడిన అనుభవం ఉన్న షఫాలీ వర్మ, రిచా ఘోష్తో పాటు సీనియర్లు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మందన, జెమీమా రోడ్రిగ్స్ సమిష్టిగా సత్తాచాటితేనే భారత్ విజయావకాశాలు మెరుగవుతాయి. బౌలింగ్లో దీప్తి శర్మకు తోడు పేసర్ రేణుక సింగ్ కీలకం కానుంది. మరోవైపు అలీసా హీలీ, బెత్ మూనీ, మెగ్ లానింగ్, ఎలీసా పెర్రీ, గార్డ్నెర్, తహిలా మెక్గ్రాంత్, మేగన్ షుట్, అలానా కింగ్తో ఆసీస్ జట్టు శత్రు దుర్భేద్యంగా కనిపిస్తున్నది.
దాదాపు మూడేండ్ల క్రితం జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడిన జట్టులోని ఆటగాళ్లలో 8 మంది ప్రస్తుత భారత జట్టులోనూ కొనసాగుతున్నారు. షఫాలీ, రిచా అప్పుడు జూనియర్లు కాగా.. ఇప్పుడు వాళ్లపైనే ప్రధాన బాధ్యత ఉంది. అప్పుడు సారథిగా వ్యవహరించిన హర్మన్ప్రీత్ కౌర్ ప్రస్తుత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా.. వైస్ కెప్టెన్ స్మృతి మందనపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ మ్యాచ్లో రాణించిన ఆల్రౌండర్లు దీప్తి శర్మ, రాధా యాదవ్ మరోసారి మెరువాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తుండగా.. శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్ ఈ సారి మరింత బాధ్యతతో ఆడాల్సిన అవసరముంది.
సెమీస్ కోసం మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. మొదట బ్యాటింగ్ అవకాశం వస్తే 180 పైచిలుకు బోర్డుపై పెట్టడమే మా లక్ష్యం. ఆసీస్ వద్ద మంచి బ్యాటర్లు ఉన్నారు. వారిని 140-150 పరుగుల మధ్య కట్టడి చేస్తే మ్యాచ్ సొంతమైనట్లే. ఆసీస్ బలమైన జట్టే కాదనలేం కానీ, వారిని ఓడించే సత్తా మాకు ఉంది. గతంలో ఇది నిరూపితమైంది. దాన్నే రిపీట్ చేయాలనుకుంటున్నాం
-రిచా ఘోష్
టీ20ల్లో గత ఐదేండ్లలో ఆస్ట్రేలియా 8 సార్లు మాత్రమే ప్రత్యర్థికి 160 పైచిలుకు పరుగులు చేయనిచ్చింది. అందులో టీమ్ఇండియా ఐదుసార్లు ఈ మార్క్ దాటింది.
భారత్: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ, స్మృతి, జెమీమా, రిచా, దీప్తి, పూజ, శిఖ, రాధ, రాజేశ్వరి, రేణుక.
ఆస్ట్రేలియా: లానింగ్ (కెప్టెన్), హీలీ, మూనీ, పెర్రీ, గార్డ్నెర్, తహిలా, హారిస్, జార్జియా, అలానా, షుట్, బ్రౌన్.