ఉదయం 11.30 నుంచి తొలి పోరులో ఆల్రౌండ్ వైఫల్యంతో ఓడిన టీమ్ఇండియా.. బంగ్లాదేశ్తో రెండో వన్డేకు సిద్ధమైంది. గత మ్యాచ్ తప్పిదాలను అధిగమించి రోహిత్ సేన సిరీస్ సమం చేయాలని చూస్తుంటే.. ఇదే ఊపులో కప్పు కొట్టేయాలనిబంగ్లా భావిస్తున్నది.
మీర్పూర్: స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తొలి వన్డేలో పరాజయం పాలైన భారత క్రికెట్ జట్టు.. బుధవారం బంగ్లాదేశ్తో రెండో మ్యాచ్లో తలపడనుంది. టాపార్డర్ వైఫల్యం కారణంగా కనీసం రెండొందల పరుగులు కూడా చేయలేకపోయిన టీమ్ఇండియా.. బంగ్లా పదో వికెట్ పడగొట్టలేక మూల్యం చెల్లించుకుంది. మరి గాయపడ్డ బెబ్బులిలా రోహిత్ సేన పంజా విసురుతుందా లేక.. సిరీస్ అప్పగిస్తుందా మీర్పూర్లో తేలనుంది. టాప్-3 ప్లేయర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ సమష్టిగా సత్తాచాటాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటున్నది. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేయనుండగా.. ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్ అటు బంతితో, ఇటు బ్యాట్తో ప్రభావం చూపాల్సిన అవసరముంది. ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, షమీ గైర్హాజరీలో హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ సత్తాచాటుతున్నాడు. అతడితో పాటు శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్, కుల్దీప్ సేన్ పేస్ భారం మోయనున్నారు.