Ind Vs Aus 1st ODI | మొహాలీ: స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్నకు ముందు సన్నాహకాల్లో భాగంగా టీమ్ఇండియా కంగారూలతో వన్డే సిరీస్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల్లో భాగంగా శుక్రవారం మొహాలీ వేదికగా తొలి వన్డే జరుగనుండగా.. సీనియర్లకు విశ్రాంతినిచ్చిన భారత్.. రిజర్వ్ బలాన్ని పరిక్షించనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్కు తొలి రెండు మ్యాచ్ల నుంచి రెస్ట్ ఇవ్వగా.. కేఎల్ రాహుల్ టీమ్కు సారథ్యం వహించనున్నాడు. వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు ఖయాం చేసుకోవాలని తహతహలాడుతున్న యువ ఆటగాళ్లకు ఇది చక్కటి అవకాశం కానుంది. రోహిత్ గైర్హాజరీలో శుభ్మన్ గిల్తో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయడం ఖాయమే కాగా.. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ మిడిలార్డర్లో బ్యాటింగ్కు రానున్నారు.
తొలి రెండు మ్యాచ్లకు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్న తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మకు ప్లెయింగ్ ఎలెవన్లో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తున్నది. అయితే అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకుంటే.. తిలక్కు చాన్స్ దక్కొచ్చు. ఇక చాన్నాళ్ల తర్వాత వన్డే టీమ్లోకి వచ్చిన సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై అందరి దృష్టి నిలువనుంది. అక్షర్ పటేల్ గాయంతో బాధపడుతుండటంతో అతడి స్థానంలో అశ్విన్, వాషింగ్టన్ సుందర్కు టీమ్లో ప్లేస్ దక్కగా.. వారు ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది ఆసక్తికరం. ఇక మరోవైపుఆస్ట్రేలియా.. ఈ సిరీస్ను వరల్డ్కప్నకు రిహార్సల్గా భావిస్తున్నది.