వన్డే సిరీస్లో విఫలమైన భారత అమ్మాయిలు.. పొట్టి ఫార్మాట్లో దుమ్మురేపారు. 50 ఓవర్ల ఫార్మాట్లో కంగారూల చేతిలో వైట్వాష్కు గురైన హర్మన్ప్రీత్ బృందం.. టీ20ల్లో శుభారంభం చేసింది. మొదట బౌలర్లు సత్తాచాటి ప్రత్యర్థిని ఓ మాదిరి స్కోరుకే పరిమితం చేయగా.. ఆనక ఓపెనర్లు దంచికొట్టడంతో టీమ్ఇండియా సునాయాసంగా గెలుపొందింది. షఫాలీ వర్మ, స్మృతి మంధన అర్ధశతకాలతో అదరగొట్టారు.
ముంబై: కంగారూలపై పూర్తి ఆధిపత్యం కనబర్చిన భారత మహిళల జట్టు.. టీ20 సిరీస్లో శుభారంభం చేసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో విరుచుకుపడిన టీమ్ఇండియా.. శుక్రవారం జరిగిన తొలి టీ20లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్లో హర్మన్ప్రీత్ బృందం 1-0తో ముందంజ వేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. లిచ్ఫీల్డ్ (32 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎలీసా పెర్రీ (37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. కెప్టెన్ అలీసా హీలీ (8), తహీలా మెక్గ్రాత్ (0), ఆష్లే గార్డ్నర్ (0), గ్రేస్ హారీస్ (1), బెత్ మూనీ (17) విఫలమయ్యారు. మన బౌలర్లలో టిటాస్ సధు 4, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (44 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), స్మృతి మంధన (54; 7 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నారు. టిటాస్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో టీ20 జరగనుంది.
ఛేదనలో భారత్కు ఏమాత్రం ఇబ్బంది ఎదురుకాలేదు. డార్సీ బ్రౌన్ వేసిన తొలి ఓవర్లో.. బ్యాటర్ల ప్రమేయం లేకుండా మూడు ఫోర్లు రావడంతో టీమ్ఇండియాకు మెరుగైన ఆరంభం లభించగా.. ఇక అక్కడి నుంచి షఫాలీ, స్మృతి ఎడాపెడా బౌండ్రీలతో కంగారూలపై విరుచుకుపడ్డారు. సదర్లాండ్ బౌలింగ్లో మంధన సిక్సర్ బాదితే.. మేగన్ షుట్ ఓవర్లో షఫాలీ రెండు ఫోర్లు కొట్టింది. స్మృతి కాస్త ఆచితూచి ఆడినా.. షఫాలీ మాత్రం బౌండ్రీలే పరమావధిగా రెచ్చిపోయింది. ఈ క్రమంలో షఫాలీ 32 బంతుల్లో, మంధన 50 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. మన బ్యాటర్ల జోరుకు ఆసీస్ ఫీల్డింగ్ లోపాలు కూడా కలిసి రావడంతో టీమ్ఇండియా అలవోక విజయం సాధించింది.
సొంతగడ్డపై ఏకైక టెస్టులో ఆస్ట్రేలియాను ఆటాడుకున్న భారత అమ్మాయిలు.. ఆ తర్వాత వన్డేల్లో అదే జోరు కొనసాగించలేకపోయారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో ఏమాత్రం ప్రభావం చూపలేక వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడి కంగారూలకు సిరీస్ అప్పగించారు. దీంతో అదనపు ఒత్తిడితో బరిలోకి దిగిన మన అమ్మాయిలు.. పొట్టి ఫార్మాట్లో ఇరగదీశారు. ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో యంగ్ ప్లేయర్స్కు ఎక్కువ అవకాశాలు ఇవ్వగా.. వాళ్లు సత్తాచాటారు. అండర్-19 స్థాయి నుంచే తన బౌలింగ్తో ప్రత్యర్థులను భయపెడుతున్న రైటార్మ్ పేసర్ టిటాస్ సధు.. బంతితో నిప్పులు చెరిగింది. నాలుగో ఓవర్లో బెత్ మూనీని ఔట్ చేసి వికెట్ల వేటకు తెరలేపిన టిటాస్.. ఆ తర్వాత తహిలా, గార్డ్నర్, సదర్లాండ్ను బుట్టలో వేసుకుంది. వేగం, కచ్చితత్వం కలగలిపి టిటాస్ సంధించిన బంతులకు కంగారూల వద్ద బదులే లేకపోయింది. మరోవైపు నుంచి శ్రేయాంక, దీప్తి కూడా విజృంభించడంతో ఆసీస్ తక్కువ పరుగులకే పరిమితమైంది.
ఆస్ట్రేలియా: 19.2 ఓవర్లలో 141 (లిచ్ఫీల్డ్ 49, పెర్రీ 37; టిటాస్ 4/17, శ్రేయాంక 2/19), భారత్: 17.4 ఓవర్లలో 145/1 (షఫాలీ 64 నాటౌట్, స్మృతి 54; జార్జియా 1/20).