బ్యాంకాక్: ప్రతిష్ఠాత్మక థామస్ కప్లో భారత్ తొలిసారి సెమీఫైనల్స్కు దూసుకెళ్లి కొత్త చరిత్ర లిఖించింది. మలేషియాతో హోరాహోరీగా జరిగిన క్వార్టర్స్ పోరులో వీరోచితంగా పోరాడిన మన షట్లర్లు కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. గురువారం జరిగిన పోరులో భారత్ 3-2 తేడాతో మలేషియాపై అద్భుత విజయం సాధించింది. తొలి సింగిల్స్లో యువ షట్లర్ లక్ష్యసేన్ 21-23, 9-21 తేడాతో లీజి జియా చేతిలో ఓటమిపాలయ్యాడు. ఆ తర్వాత జరిగిన డబుల్స్లో సాత్విక్సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం 21-19, 21-15తో గొసెఫి, నూర్ ఇజుద్దీన్ జోడీపై గెలిచింది. అదే జోరు కొనసాగిస్తూ సింగిల్స్లో సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ 21-11, 21-17తో జీ టియాంగ్పై అలవోక విజయం సాధించాడు. 37 నిమిషాల్లో ముగిసిన పోరులో శ్రీకాంత్ అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.
ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా డ్రాప్ షాట్లు, నెట్గేమ్తో కీలక పాయింట్లు కొల్లగొట్టాడు. అయితే కృష్ణప్రసాద్, విష్ణువర్ధన్గౌడ్ 19-21, 17-21తో అరోన్ చియా, తీ యి యో జంట చేతిలో ఓటమిపాలైంది. దీంతో ఇరు జట్ల స్కోరు 2-2తో సమమైంది. నిర్ణయాత్మక ఆఖరి సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ 21-13, 21-18తో లియాంగ్ జున్హవోను చిత్తుచేసి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు. 39 నిమిషాల్లో ముగిసిన పోరులో ప్రణయ్ తనదైన ఆటతీరుతో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. ఎక్కడా తడబాటుకు లోనుకాకుండా సూపర్ షాట్లతో వరుస గేముల్లో మ్యాచ్ను తన వశం చేసుకున్నాడు.
అమ్మాయిలు నిష్క్రమణ
ఉబర్ కప్లో భారత మహిళల బృందం పోరాటం క్వార్టర్స్లో ముగిసింది. గ్రూప్-డిలో పీవీ సింధు నేతృత్వంలోని టీమ్ఇండియా 0-3తో థాయిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. సింగిల్స్లో తెలుగు స్టార్ షట్లర్ సింధు 21-18, 17-21, 12-21 తేడాతో రచనోక్ ఇంటానన్ చేతిలో ఓడిపోవడంతో భారత్ పతక ఆశలు ఆవిరయ్యాయి. డబుల్స్లో శ్రుతి మిశ్రా-సిమ్రన్ సింఘీ జోడీ, మరో సింగిల్స్లో ఆకర్షి కశ్యప్ పరాజయాలతో భారత్.. ఉబర్ కప్ నుంచి నిష్క్రమించింది.
1 – 1949లో ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక థామస్ కప్లో భారత్ సెమీఫైనల్కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. ఉబర్ కప్లో 2014, 16లో భారత్ రెండు కాంస్య పతకాలు దక్కించుకుంది.