వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్లో పలువురు ఆటగాళ్లు సత్తా చాటారు. వారిలో ముఖ్యంగా వార్తల్లో నిలిచింది సూర్యకుమార్ యాదవ్. ఈ మిడిలార్డర్ బ్యాటర్ సిరీస్లో 194.55 స్ట్రైక్రేట్తో 109 పరుగులు చేశాడు. ముఖ్యంగా మూడో మ్యాచులో అతని ఆటతీరు అత్యద్భుతం. ఈ క్రమంలో అతనిపై పలువురు మాజీలు ప్రశంసలు కురిపించారు. వారిలో మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ కూడా ఒకడు.
అతను ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్ను సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్తో పోల్చాడు. ‘‘మూడో టీ20లో అతని ఆట సూపర్. రోహిత్ శర్మ కూడా అవుటైన మ్యాచ్లో చివరి వరకు నిలబడి జట్టుకు మంచి స్కోరు అందించాడు. సెటిల్డ్ బ్యాటర్ చివర్లో క్రీజులో ఉంటే అతను ప్రమాదకరంగా మారతాడు. అలాంటి ఒత్తిడిలో బౌలర్లు గాడి తప్పుతారు’’ అని సూర్యకుమార్ పాత్రను మెచ్చుకున్నాడు.
అలాగే అన్ని రకాల షాట్లు ఆడగలడని సూర్యకుమార్కు పేరుంది. దీన్ని కూడా ప్రస్తావించిన పార్థివ్ పటేల్.. ‘‘అతను కూడా సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్లా 360 డిగ్రీల ఆటగాడు’’ అంటూ కితాబిచ్చాడు. వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో మూడో మ్యాచులో ‘‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’’ అవార్డు అందుకున్న సూర్య.. ‘‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’’ అవార్డు కూడా అందుకున్న సంగతి తెలిసిందే.