IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలానికి ముందు అన్ని జట్లు తమ వద్ద అట్టిపెట్టుకునే, వదిలించుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేయడానికి సమయం దగ్గర పడుతోంది. ఈనెల 26 సాయంత్రం నాటికి పది ఫ్రాంచైజీలు ఆ వివరాలను బీసీసీఐకి అందజేయాల్సి ఉంది. ఈసారి వేలానికి ముందే అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం గుజరాత్ టైటాన్స్ సారథి హార్ధిక్ పాండ్యా ట్రేడ్. గుజరాత్ టైటాన్స్ యాజమన్యంతో విభేదాల కారణంగా అతడు వచ్చే సీజన్ నుంచి తిరిగి ముంబై ఇండియన్స్కు చేరుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేలానికి ముందే ఇలా ఒక జట్టు నుంచి మరో జట్టుకు బదిలీ అయిన ఆటగాళ్లు ఎవరైనా ఉన్నారా..? అన్న వివరాలు చూద్దాం.
సాధారణంగా ఫ్రాంచైజీలు ఒక సీజన్లో సరిగ్గా ఆడని ఆటగాళ్లను వేలంలో వదిలేయడం.. వారికి బదులుగా ఇతర జట్లలో ఉన్న ఆటగాళ్లను బదిలీ చేసుకోవడం మామూలే. కానీ కెప్టెన్లను వదులుకోవడం చాలా అరుదుగా జరిగేదే. ఇలా చేసిన జట్లలో గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్లు ఉన్నాయి. 2019 సీజన్లో పంజాబ్ కింగ్స్కు సారథిగా వ్యవహరించిన రవిచంద్రన్ అశ్విన్ను ఢిల్లీ క్యాపిటల్స్ ట్రేడ్ ప్రక్రియలో భాగంగా దక్కించుకుంది.
ఇదే సీజన్లో ఢిల్లీ.. రాజస్తాన్ రాయల్స్కు కెప్టెన్గా ఉన్న అజింక్యా రహానేను కూడా తీసుకుంది. వీళ్లకు సారథిగా బాధ్యతలు అప్పజెప్పకున్నా ఆటగాళ్లుగా కొనసాగించింది. ఈ ఇరువురూ 2020 సీజన్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఆడారు. ఢిల్లీ క్యాపిటల్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది కూడా ఆ ఏడాదిలోనే. 2020 సీజన్లో ఢిల్లీ ఐపీఎల్ ఫైనల్కు చేరింది. తుదిపోరులో ముంబై చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది.