Jasprit Bumrah | టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెరీర్ ఎక్కువ రోజులు కొనసాగాలంటే.. మూడు ఫార్మాట్లలో ఏదో ఒకదాన్ని వదిలేయడమే ఉత్తమమని.. ఆస్ట్రేలియా మాజీ పేసర్ మెక్గ్రాత్ సూచించగా.. ఇప్పుడు శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. మూడు ఫార్మాట్లలో కొనసాగే కన్నా.. ఒక దాన్ని వదిలేసి మిగిలిన రెండింటిపై మరింత దృష్టి పెట్టడం ఉత్తమమని వాస్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో ప్రమాదకర పేసర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న జస్ప్రీత్ స్ప్రీత్ బుమ్రా.. తన రనప్ కారణంగా తరచూ గాయాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. నిరుడు వెన్ను నొప్పి కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా.. దాదాపు ఏడాది తర్వాత ఇటీవలే పునరాగమనం చేశాడు. ఐర్లాండ్ తో రెండు టీ20 మ్యాచ్లు ఆడిన బుమ్రా.. ఆ తర్వాత నేరుగా ఆసియాకప్లో బరిలోకి దిగాడు. ఇందులోనూ నేపాల్ తో మ్యాచ్కు వ్యక్తిగత కారణాల వల్ల దూరమైన బుమ్రా.. సూపర్-4 స్టేజ్ లో రెండు మ్యాచ్లు ఆడాడు.
పాకిస్థాన్, శ్రీలంకపై విజయాలు సాధించిన భారత్ ఇప్పటికే ఫైనల్కు చేరడంతో బంగ్లాదేశ్ తో పోరు నుంచి బుమ్రాకు విశ్రాంతి కల్పించారు. ఈ నేపథ్యంలో వాస్ వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ‘విభిన్న యాక్షన్తో బంతులేసే బుమ్రా.. ఏదో ఒక ఫార్మాట్ నుంచి తప్పుకోవడం మంచిది. పేస్ బౌలర్ల మీద ఎంత ఒత్తిడి ఉంటుందో అందిరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇలాంటి భిన్నమైన రనప్ తో జట్టు బాధ్యతలు మోస్తూ ఎక్కువ కాలం కొనసాగలేం అందుకే.. ఏదో ఒక ఫార్మాట్ను వదిలేసి.. మరొకదాన్ని ఎంపిక చేసుకొని దానిపై ఎక్కువ దృష్టి పెట్టడమే మంచిది’ అని వాస్ పేర్కొన్నాడు.