న్యూఢిల్లీ: టీమ్ఇండియాతో సిరీస్ను ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్నకు సన్నాహకంగా భావిస్తున్నామని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా పేర్కొన్నాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 9 నుంచి ఐదు మ్యాచ్ల పొట్టి సిరీస్ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే భారత్ చేరుకున్న సఫారీ టీమ్ ప్రాక్టీస్లో మునిగిపోయింది.
గతేడాది యూఏఈ వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్ అనంతరం టీ20 ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ ఆడని దక్షిణాఫ్రికా.. ఈ సిరీస్ను మెగాటోర్నీకి రిహార్సల్గా భావిస్తున్నది. ఈ నేపథ్యంలో శనివారం బవుమా మాట్లాడుతూ.. ‘భారత్ పరిస్థితులకు ఆసీస్ వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. అయినా ఈ సిరీస్ మాకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. పొట్టి ఫార్మాట్లో చాలా రోజుల తర్వాత మ్యాచ్లు ఆడనున్నాం. ఆటగాళ్లు వాళ్ల బాధ్యతలు గుర్తించేందుకు ఈ సిరీస్ తోడ్పడుతుంది. కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. వారి ప్రదర్శనను అంచనా వేసేందుకు కూడా ఈ సిరీస్ ఉపయోగపడుతుంది’అని అన్నాడు.
మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ఆటగాళ్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. కేఎల్ రాహుల్ సారథ్యంలో జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే నెలలో ఇంగ్లండ్ వేదికగా ఏకైక టెస్టుతో పాటు పరిమిత ఓవర్ల సిరీస్లు జరుగనుండటంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లకు బోర్డు రెస్ట్ ఇచ్చింది. దీనిపై బవుమా స్పందిస్తూ.. సీనియర్లు లేకపోయినా టీమ్ఇండియా బలంగానే ఉందని పేర్కొన్నాడు. ‘భారత జట్టు కూడా కొత్తగా కనిపిస్తున్నది.
ఐపీఎల్లో రాణించిన ఆటగాళ్లు చాలామంది జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. భారత జట్టును ‘బి’టీమ్గా భావించడం లేదు. కొత్త ఆటగాైళ్లెనా ప్రతిభ విషయంలో కొదవలేదు. సిరీస్లో హోరాహోరీ తప్పకపోవచ్చు. ఇటీవలి కాలంలో భారత జట్టు దూకుడుగా ఆడుతున్నది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వాళ్లు అందుబాటులో లేకున్నా వారి స్ఫూర్తి జట్టులో కొనసాగడం ఖాయమే. మేము ప్రత్యర్థిని తేలికగా తీసుకోవడం లేదు. భారత్ను భారత్లో ఓడించడం ఎప్పుడూ కష్టమే’అని బవుమా వివరించాడు.