రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టిన సీఎం కప్లో సోమవారం నుంచి జిల్లా స్థాయి క్రీడా పోటీలు హోరాహోరీగా సాగాయి. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్లేయర్లతో కలిసి పోటీల్లో సందడి చేశారు. మొత్తం 11 క్రీడాంశాల్లో తమ ప్రతిభను చాటేందుకు ఆటగాళ్లు కదంతొక్కుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో సీఎం కప్ పోటీలు మొదటి రోజు ఇలా సాగాయి.
(నమస్తే తెలంగాణ, న్యూస్ నెట్వర్క్): రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నది. ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకెళుతున్న ప్రభుత్వం అందుకు తగ్గట్లు పక్కా ప్రణాళికను ఎంచుకున్నది. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఈ నెల 15 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు నిర్వహిస్తున్నది. తొలిసారి నిర్వహిస్తున్న టోర్నీలో ఇప్పటికే మండల స్థాయిలో పోటీలు ముగియగా, సోమవారం జిల్లా స్థాయిలో సీఎం కప్నకు అట్టహాసంగా తెరలేచింది. మండల స్థాయిలో సత్తాచాటిన ప్లేయర్లు, ఆయా జట్లను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు శ్రీనివాస్గౌడ్, శ్రీనివాస్యాదవ్, ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ నెల 24 వరకు జరుగనున్న టోర్నీలో సత్తాచాటేందుకు ప్లేయర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. దాదాపు 16వేల గ్రామాల్లో ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి తోడు ప్రతీ నియోజకవర్గంలో మినీ స్టేడియాలను త్వరలో ప్రారంభించబోతున్నది.
ప్రభుత్వం క్రీడల పట్ల కచ్చితమైన విజన్తో ముందుకెళుతున్నది. ఆయా క్రీడాంశాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలతో సత్తాచాటిన వారిని సముచిత రీతిలో సత్కరిస్తున్నది. దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా ప్రతిష్ఠాత్మక టోర్నీలైన ఒలింపిక్స్, ఆసియాగేమ్స్, కామన్వెల్త్, ప్రపంచ చాంపియన్షిప్లలో పతకాలు సాధించిన వారికి భారీగా నగదు ప్రోత్సాహకాలతో పాటు ఖరీదైన నివాస స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నది. దీనికి తోడు ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కింద రెండు శాతం, ప్రొఫెషనల్ కోర్సుల్లో 0.5 శాతం కోటాను అమలు చేస్తున్నది. క్రీడల్లో ఒక రకంగా మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రానున్న రోజుల్లో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలన్న పట్టుదలతో ఉన్నది.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తున్నది. యువకుల్లో దాగున్న ప్రతిభకు సానబెట్టేందుకు క్షేత్ర స్థాయిలో కృషి చేస్తున్నది. గ్రామీణ క్రీడా ప్రాంగణాల ద్వారా యువతను ఆటల వైపు మళ్లించేలా ప్రయత్నిస్తున్నది. నిత్యం చదువులతో కుస్తీ పట్టే విద్యార్థులకు ఆటవిడుపుగా క్రీడలను ఎంచుకునేలా ప్రోత్సహిస్తున్నది. సోమవారం జింఖానా మైదానం వేదికగా జిల్లా స్థాయి క్రీడా పోటీలను మంత్రులు శ్రీనివాస్గౌడ్, శ్రీనివాస్యాదవ్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సమైక్య రాష్ట్రంలో నిరాదరణకు గురైన క్రీడలకు ప్రత్యేక రాష్ట్రంలో సరైన గుర్తింపు లభిస్తుందని మంత్రులు పేర్కొన్నారు. తెలంగాణ తరఫున సత్తాచాటిన వారిని ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్లు అమలు చేస్తూ పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నగేశ్, మన్నె క్రిశాంక్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు తమ సొంత జిల్లాల్లోమంత్రులు గంగుల కమలాకర్, ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్, నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, ఇంద్రకణ్ రెడ్డి.. సీఎం కప్ పోటీలను ప్రారంభించి ప్లేయర్లలో ఉత్సాహాన్ని నింపారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో సీఎం కప్ జిల్లా పోటీలను సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ ప్రారంభించారు. జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ ఎస్పీ సంకీర్త్, డీవైఎస్వో రమణరాజుతో కలిసి చైర్మన్ పోటీల్లో పాలుపంచుకున్నారు.