టోక్యో: ఒలింపిక్స్పై జపాన్లో వ్యతిరేకత నానాటికీ అధికమవుతున్నది. కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో ఉన్న సమయంలో టోక్యో విశ్వక్రీడలు నిర్వహించొద్దన్న డిమాండ్ ఊపందుకుంది. ఇంతకాలం ఒలింపిక్స్ నిలిపివేతకు జపాన్ ప్రజలు ఉద్యమించగా.. తాజాగా ఆ దేశ మీడియా కూడా రంగప్రవేశం చేసింది. ఈ ఏడాది జూలై 23న ప్రారంభం కావాల్సిన ఒలింపిక్స్ను రద్దు చేయాలని జపాన్ ప్రముఖ వార్తాపత్రిక అసాహి షుమ్బున్ డిమాండ్ చేసింది. విశ్వక్రీడలకు స్పాన్సర్గా ఉన్న ఆ పత్రిక వ్యతిరేక గళం వినిపించడం ఆసక్తికరంగా మారింది. ఈ వేసవిలో ఒలింపిక్స్ నిర్వహించడం సరికాదనుకుంటున్నాం. విశ్వక్రీడలు రద్దు చేయాలని ప్రధాని యొషిండే సుగాను డిమాండ్ చేస్తున్నాం అని పత్రిక తమ సంపాదకీయంలో పేర్కొంది. మరోవైపు ఒలింపిక్స్ సమీపిస్తున్నా జపాన్లో ప్రజలకు అత్యల్ప శాతంలోనే వ్యాక్సినేషన్ పూర్తికాగా.. కేసుల సంఖ్య సైతం పెరుగుతున్నది. దీంతో 2020 నుంచి ఈ ఏడాదికి వాయిదా పడిన ఒలింపిక్స్ నిర్వహణపై అనుమానాలు బలపడుతున్నాయి. కరోనా క్లిష్ట సమయంలో ఒలింపిక్స్ వద్దంటూ ఆ దేశ వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు జపాన్ ప్రభుత్వంతో పాటు ఐఓసీ విశ్వక్రీడలను నిర్వహించి తీరుతామని చెబుతున్నాయి. అయితే టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై తుది నిర్ణయం జూన్ చివరివారంలోనే తీసుకునే అవకాశం ఉందని ఐవోసీ సీనియర్ సభ్యుడు రిచర్డ్ పౌండ్ చెప్పాడు.
రద్దయితే రూ.12లక్షల కోట్లు నష్టం
కరోనా కారణంగా ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ రద్దయితే జపాన్ 17 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12.36 లక్షల కోట్లు) నష్టపోతుందని ఓ పరిశోధన తేల్చింది. విశ్వక్రీడలు జరుగకపోతే జపాన్ ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతుందంటూ నొమూరా రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తేల్చిందని క్యోడో న్యూస్ వెల్లడించింది.
భారత అథ్లెట్లకు వ్యాక్సినేషన్పై ఆరా
టోక్యో ఒలింపిక్స్లో పాల్గొననున్న అథ్లెట్లు, కోచ్లు, అధికారులకు వ్యాక్సిన్ అందించే ప్రక్రియ ఏ మేరకు జరిగిందని భారత ఒలింపిక్స్ సంఘం (ఐవోఏ) ఆరా తీసింది. ఈ మేరకు ఆయా జాతీయ క్రీడాసంఘాలను వివరాలు కోరింది. మొత్తంగా 90 మందికిపైగా భారత అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు.
రోజుకు 18వేల మంది ప్రేక్షకులు
బర్మింగ్హామ్: క్రికెట్ స్టేడియాల్లో గతంలో లాగా తిరిగి ప్రేక్షకులను చూడబోతున్నామా. కరోనా కారణంగా ఏడాదిగా పూర్తి స్థాయిలో ప్రేక్షకులు లేకుండా సాగిన క్రికెట్ మ్యాచ్లు ఇప్పుడు సందడిగా మారబోతున్నాయి. బ్రిటన్ ప్రభుత్వం పైలెట్ ఈవెంట్ కింద ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్కు ఫ్యాన్స్కు అనుమతిచ్చేందుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్లో జరిగే ఈ మ్యాచ్ కోసం రోజుకు 18వేల మంది ప్రేక్షకులకు అనుమతి ఇవ్వబోతున్నట్లు నిర్వహణ అధికారులు బుధవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు.