Cricket | వన్డే ప్రపంచకప్ గ్రాండ్ సక్సెస్ అయింది! గత రికార్డులు తిరగరాస్తూ.. భారీ సంఖ్యలో అభిమానులు ప్రత్యక్షంగా, పరోక్షంగా మ్యాచ్లను వీక్షించారు. టీమ్ఇండియా ఆడే మ్యాచ్లే కాకుండా.. ఇతర దేశాల మ్యాచ్లు చూసేందుకు సైతం అభిమానులు పోటెత్తారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వరల్డ్కప్ను పన్నెండున్నర లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. ఇక భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగిన ఫైనల్ను ఒక్క హాట్ స్టార్లోనే 5.9 కోట్ల మంది చూశారు. ఇక టీవీల్లో చూసిన వాళ్లకు లెక్కేలేదు. ఇది క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు. ఒకవేళ మ్యాచ్ హోరాహోరీగా సాగి ఉంటే ఈ సంఖ్య మరింత పెరిగి ఉండేదే!
టికెట్ల కోసం పడరాని పాట్లు.. మ్యాచ్ జరిగే నగరంలో బస చేసేందుకు నానా తంటాలు.. బ్లాక్ టికెట్ కోసం వేలకు వేలు, లక్షలకు లక్షలు వెచ్చించడం ఇలా నెల రోజులుగా ఎక్కడ చూసినా ఇలాంటి వార్తలే. అయితే నిజంగా పరిస్థితి అదేనా అంటే కచ్చితంగా ఔనని చెప్పలేం! మనదేశంలో మినహా మరెక్కడా.. వన్డేలకు భవిష్యతు కనిపించడం లేదనేది చేదు వాస్తవం!!
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : జెంటిల్మన్ గేమ్గా గుర్తింపు తెచ్చుకున్న క్రికెట్లో.. సుదీర్ఘ ఫార్మాట్తో విసిగిపోయిన సందర్భంలో వన్డేలు పురుడు పోసుకున్నాయి. మొదట 60 ఓవర్లతో ప్రారంభమై.. కాలక్రమేణా రూపాంతంరం చెందుకుంటూ.. ప్రస్తుతం ఉన్న స్థితికి చేరాయి. అయితే ‘ముందు వచ్చిన చెవుల కన్నా వెనక వచ్చిన కొమ్ములు వాడి’ అన్నట్లు.. వన్డేల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన టీ20లు ప్రజాదరణలో దూసుకుపోతున్నాయి. ప్రజల జీవన విధానంలో మార్పులు రావడంతో పాటు.. 8 గంటలు వెచ్చించి వన్డే మ్యాచ్ చూసే సమయం అభిమానులకు సైతం లేకపోవడంతో రానున్న కాలంలో వన్డేల ప్రభావం తగ్గిపోవడం ఖాయమే అని పులువురు అంచనాలు వేస్తున్నారు. తాజా ప్రపంచకప్ సక్సెస్తో నిర్వాహకులు సైతం ఆనందంగానే ఉన్నా.. మున్ముందు మాత్రం సచిన్ టెండూల్కర్, వసీమ్ అక్రమ్ సూచనలను అమలు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తున్నది.
వన్డే మ్యాచ్లపై ఆసక్తి పెంచాలంటే.. ఇన్నింగ్స్ను 25 ఓవర్లకు కుదించడం మంచిదని గతంలో సచిన్ సూచించాడు. మొదట ఒక జట్టు 25 ఓవర్లు బ్యాటింగ్ చేయడం ఆ తర్వాత మరో జట్టు 25 ఓవర్లు ఆడటం.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ రూపంలో ఇదే సీన్ రిపీట్ చేయడం ద్వారా మ్యాచ్పై ఆసక్తి మరింత పెంపొందించవచ్చని మాస్టర్ సూచించాడు. మరోవైపు పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీమ్ అక్రమ్ మాత్రం వన్డేలను 50 ఓవర్ల నుంచి కుదించి 40 ఓవర్లకు తీసుకురావడం బెస్ట్ అని అభిప్రాయపడ్డాడు. ఇప్పడు ఇన్నింగ్స్ ఆది, అంత్యాలను చూసేందుకు మాత్రమే అభిమానులు ఆసక్తి చూపుతున్నారని.. మధ్య ఓవర్లలో ఆట వాళ్లకు బోరింగ్గా మారిందని అందుకే మరో పది ఓవర్లు తగ్గిస్తే బాగుటుందని అన్నాడు. అయితే స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్, ప్యాట్ కమిన్స్ వంటి వాళ్ల వాదన ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నది. ఓ ప్లేయర్లోని నైపుణ్యం, సహనశీలత, పట్టుదల, పోరాట పటిమను పరీక్షించడంలో వన్డే ఫార్మాట్ను మించింది లేదని కోహ్లీ గతంలో పలుమార్లు వెల్లడించాడు.
దాదాపు అన్ని దేశాల బోర్డులు ఏదో ఒక లీగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. అంతర్జాతీయ క్రికెట్లో ద్వైపాక్షిక వన్డే సిరీస్ల ప్రాధాన్యం తగ్గుతూ వస్తున్నది. ఇప్పటి పరిస్థితినే చూసుకుంటే.. వన్డే వరల్డ్కప్ ముగిసిపోవడంతో.. 2024 మొత్తంలో టీమ్ఇండియా కేవలం 6 వన్డేలు మాత్రమే ఆడనుంది. పాకిస్థాన్ అయితే వచ్చే ఏడాది నవంబర్ వరకు అసలు వన్డేల జోలికే వెళ్లడం లేదు. మరి కొన్ని దేశాలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. వన్డే వరల్డ్కప్, చాంపియన్స్ ట్రోఫీ వంటి టోర్నీలు ఉన్న సమయంలోనే వన్డేలు ఆడి.. మిగిలిన సమయంలో టెస్టు, టీ20 ఫార్మాట్లకు పరిమితం కావాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే తాజా వరల్డ్కప్ సక్సెస్ మాత్రం ఐసీసీలో ఫుల్ జోష్ నింపింది. క్రికెట్కు కేంద్రబిందువుగా ఉన్న భారత్లో ఈ టోర్నీ నిర్వహించడం వల్ల ఇంత విజయవంతం కాగా.. వచ్చే సారి (2027లో) దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరిగే వన్డే వరల్డ్కప్నకు ఈ స్థాయిలో ఆదరణ లభించడం కల్లే! మరోసారి వన్డే ఫార్మాట్ భవితవ్యంపై చర్చ జరిగే చాన్స్ ఉంది.